assam Cm
-
హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం) రాయని డైరీ
ఎంత వద్దనుకున్నా... కొన్ని జ్ఞాపకాలు, బ్రహ్మపుత్ర నదీ తీరాన జంటగా సాగే చక్రవాక పక్షుల్లా రెక్కలార్చుకుంటూ వచ్చి వాలుతుంటాయి. వాటిని ఆపలేము! ఎన్నికల ప్రచారానికి రేయింబవళ్లు సరిపోవటం లేదు. ఎంత ప్రయాణించినా దారులు తరిగిపోవటం లేదు. మధ్యలో – ఈ తలపుల గుంపులు రోడ్డుకు అడ్డంగా వచ్చి, కాన్వాయ్ని ఆపినట్లుగా ఆపేస్తున్నాయి! పోలింగ్కి ఇంకో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పది రోజులంటే... సమయం ఉండటం కాదు, సమయం లేకపోవడం. ఇవాళ అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా గానీ, మోదీజీ గానీ ఎప్పుడు అస్సాం వచ్చినా అదొక గొప్ప అస్సామీ సాంస్కృతిక వేడుకలా ఉంటుంది. ఇక ఈసారైతే ఏప్రిల్లో రావలసిన ‘బోహాగ్ బిహు’ పండుగ, కాస్త ముందే వచ్చినట్లు!నల్బారి జిల్లా టిహులో; సోనిత్పుర్ జిల్లా ధేకియాజులిలో... ఈరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు భారీ ర్యాలీలు ఉన్నాయి. దిగువ అస్సాంలోని టిహులో పునాది ఇంకా కొంచెం గట్టి పడాలి. బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలోని ధేకియాజులిలో తేయాకు తెగకు మరింతగా దగ్గరవ్వాలి. ఈ రెండు ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడతారు. ‘‘మీకు అండగా మీ సీఎం ఉన్నారు. మీ సీఎంకు అండగా నేను, మోదీజీ ఉన్నాం’’ అని ప్రజలకు నమ్మకం ఇస్తారు. కాంగ్రెస్కి, బీజేపీకి ఎంత తేడా!! కాంగ్రెస్ ఒకప్పుడు నాకు బ్రహ్మపుత్ర నది. ఆ నది ఒడ్డున ఉండే నారింజ–గోధుమ రంగుల చక్రవాక పక్షుల్లో నేనూ ఒకడిని. అందరం, అస్సామీ జానపద గాథల్లోని బ్రహ్మణ పక్షుల్లా ఒకరి పట్ల ఒకరం విశ్వాసంగా ఉండేవాళ్లం.కానీ రాహుల్ నన్నొక రోజు బ్రహ్మపుత్ర నుంచి తరిమేశారు! భౌగోళికంగా బ్రహ్మపుత్ర నదితో ఏమాత్రం దగ్గరితనం లేని ఢిల్లీలో కూర్చొని 2,000 కి.మీ. దూరం నుంచే నన్ను బ్రహ్మపుత్ర నుంచి విసురుగా వెళ్లగొట్టారు. మంచే జరిగింది! ఆ విసురుకు నేను బ్రహ్మపుత్ర నుండి ‘గంగానది’ గట్టున పడ్డాను. కాంగ్రెస్లోంచి బీజేపీలోకి వెళ్లటం నాకు గంగానదిలో స్నానం ఆచరించినట్లుగా ఉంది. నాకేదో ప్రక్షాళన జరిగినట్లుగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నన్ను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా మేడమ్ నిర్ణయిస్తే, మేడమ్ నిర్ణయాన్ని కూడా కాదని, పది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా లేని తరుణ్ గొగోయ్ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలని రాహుల్ పట్టుపట్టారు! ఆ తర్వాతెప్పుడూ రాహుల్కు పట్టుపట్టే అవకాశం రాలేదు. పదేళ్లుగా అస్సాంలో కాంగ్రెస్సే లేదు. ఇంకో పదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని మాటలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రోజు – గులాం నబీ ఆజాద్ – నా గురించి రాహుల్తో మాట్లాడుతూ... ‘‘మెజార్టీ ఉన్న హిమంతను పక్కన పెడితే, పార్టీ నుంచి వెళ్లిపోతాడేమో’’ అని ఆందోళనగా అన్నప్పుడు... రాహుల్ అనిన మాట, ఒక నాయకుడు అనకూడని మాట! ‘‘పోతే పోయాడు, ఆరెస్సెస్లోకే కదా పోతాడు’’ అన్నారు రాహుల్! కాంగ్రెస్లోంచి నేను బయటికి వచ్చాక, బీజేపీ నన్ను ఆదరించింది. అస్సాంకి నన్ను ముఖ్యమంత్రిని చేసింది. నన్ను సీఎంని చెయ్యటం కోసం, నా ముందున్న శర్వానంద సోనోవాల్ను ఐదేళ్లు పూర్తి కానిచ్చి కేంద్ర మంత్రిగా పంపించిన మోదీజీ, అమిత్ షాల ఔన్నత్యం ఎక్కడ?! మెజారిటీ కోల్పోయి, రెండేళ్ల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్న తరుణ్ గొగోయ్ను ముఖ్యమంత్రిగా కొనసాగించటం కోసం, మెజారిటీ ఉన్న నన్ను పక్కన పెట్టిన రాహుల్ సంకుచితత్వం ఎక్కడ?! నదులన్నీ పవిత్రమైనవే. పార్టీలన్నీ ప్రజాసేవ కోసం ఉండేవే. వ్యక్తులే... నదుల్ని, పార్టీలను కలుషితం చేస్తారు. -
జుబీన్ గర్గ్ది హత్యే..!
తేజ్పూర్: సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన గాయకుడు జుబీన్ గర్గ్ది హత్యేనని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆయన హత్యకు గురయ్యారని, ఇందుకు సంబంధించిన చార్జిషీటును కోర్టులో డిసెంబర్ 8వ తేదీలోగా వేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీన జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చురుగ్గా సాగుతోందని సీఎం చెప్పారు. డిసెంబర్ 17వ తేదీకల్లా చార్జిషీటు సమర్పించాల్సి ఉండగా అంతకన్నా ముందుగానే వేస్తామని చెప్పారు. ఆ ఘటనను హత్యగా నిర్థారించడానికి గల కారణాలను, లభ్యమైన ఆధారాల వివరాలను ఆయన వెల్లడించలేదు. జుబీన్ గర్గ్ మరణంపై రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన 60కి పైగా ఎఫ్ఐఆర్లపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ‘జుబీన్ మరణానికి సంబంధించి ఇతర దేశాల్లో ఏవైనా జరిగి ఉంటే, వాటిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో హోం మంత్రిని కలిశాను. రెండు, మూడు రోజుల్లో సిట్కు హోం శాఖ నుంచి అనుమతి మంజూరయ్యే అవకాశముంది’అని సీఎం వివరించారు. జుబీన్ గర్గ్ మృతికి సంబంధించి ఇప్పటి వరకు సిట్ ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
జుబీన్ మృతిపై జ్యుడీషియల్ కమిటీ
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ప్రత్యేకంగా విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా సారథ్యంలో కమిషన్ ఏర్పాటవుతుందని ఫేస్బుక్లో తెలిపారు. ఈ మేరకు గౌహతి ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారన్నారు. జుబీన్ గార్గ్ మృతికి దారి తీసిన పరిస్థితులు, కారణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా ఈ కమిషన్కు అందివ్వవచ్చని సీఎం అన్నారు. జుబీన్ వెంట ఉన్న అసోం అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ సభ్యులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. లేకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19వ తేదీన జుబీన్ చనిపోవడం తెల్సిందే. ఆయన అక్కడ జరిగే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యాంకను మహంతా, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆ కార్యక్రమ బ్యాండ్ సభ్యులైన శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్ప్రభ మహంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఈత కొడుతుండగా జుబీన్కు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పడవలో వీరిద్దరూ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. జుబీన్ హత్యపై 10 మందిపై కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లయింది. జుబీన్ గార్గ్ మృతిపై నమోదైన 60కి పైగా కేసులను సీఐడీ విచారిస్తోంది. సింగపూర్ ఆస్పత్రిలో చేపట్టిన జుబీన్ గార్గ్ పోస్టుమార్టం నివేదికను ఆయన భార్య గరిమాకు అందించామని, గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి చేపట్టిన పోస్టుమార్టం నివేదిక శనివారం అందాక ఆమెకే ఇస్తామని, వాటిని బహిర్గతం చేయాలా వద్దా అనేది ఆమె ఇష్టమన్నారు. శ్యాంకను మహంతా కుంభకోణంపై ఈడీ, ఐడీ దృష్టిసారించాయి. మహంతా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, బినామీ పేర్లను ఆస్తులను కూడబెట్టారంటూ వచి్చన ఆరోపణలను ఈడీ, ఐడీ పరిశీలిస్తున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి కారణంగా ఆరోపణలున్న మహంతాను ఇప్పటికే అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ఈ సందర్భంగా పోలీసులు శ్యాంకను మహంతా గత 20 ఏళ్లుగా పాల్పడుతున్న ఆర్థిక అవకతవకలను గుర్తించారు. వీటి వివరాలను ఐడీ, ఈడీ అధికారులు ఇప్పటికే సీఐడీ కార్యాలయానికి వెళ్లి తెల్సుకున్నారు. -
రాహుల్ నా సలహాలు పాటిస్తారు! : అస్సాం సీఎం హిమంత
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తాను పెంచుకునే గడ్డం విషయంలో తన సలహాలు పాటిస్తాడని ఎద్దేవా చేశారు. సీఎం హిమంత ఒక టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో భారీ గడ్డంతో ఉన్నారు. అప్పుడు అచ్చం ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారని అన్నాను. అనంతరం రాహుల్ తన గడ్డం మొత్తం తీసివేశారు. ఇప్పుడు ‘‘అమూల్ బాయ్’’లా ఉన్నారని అన్నాను. నేను రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్తో పోల్చితే గడ్డం మొత్తం తీసివేశారు... మళ్లీ నేను ‘అమూల్ బాయ్’ గా ఉన్నారని అనేసరికి చిన్నగా గడ్డం పెంచారు. రాహుల్ గాంధీ నా సలహాలు పాటిస్తారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరించడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షానికి నేృత్వత్వం వహించే వ్యక్తి.. ఒక కుర్రాడిలా టీ షర్ట్ వేసుకోవటం మన దేశ దురదృష్టం’’ అని సీఎం హిమంత సెటైర్లు వేశారు.ఇక.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం బుక్ చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పట్టుకున్న బుక్ ఎరుపులో రంగులో ఉండటంతో అది భారత్ రాజ్యాంగం కాదని.. చైనా రాజ్యాంగం అంటూ హిమంత విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగం బుక్ నీలం రంగులో ఉంటుందని తెలిపారు. అయితే హిమంత మాటలకు కాంగ్రెస్ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
లోక్సభ ఎన్నికలపై అస్సాం సీఎం కీలకవ్యాఖ్యలు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్సభ స్థానాల్లో 13 స్థానాలను భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి. ఈ విషయాన్ని గౌహతిలోని లోక్ సేవా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' ప్రకటించారు. కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ సారి తప్పకుండా 13 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందని హిమంత బిస్వా అన్నారు. అంతే కాకుండా డిబ్రూగఢ్ (Dibrugarh)లో సర్బానంద సోనోవాల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అయితే ధుబ్రి (Dhubri) సీటును గెలవలేమని ప్రస్తావించారు. అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసి చాలా సంతోషించాను. ఈ ఏట కాంగ్రెస్ పరాభవం తప్పదని.. మొత్తం ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క లోక్సభ సీటును కూడా గెలుచుకోలేకపోవచ్చని అస్సాం డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ అన్నారు. అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP) బార్పేట, ధుబ్రీ స్థానాల్లో, యూపీపీఎల్ కోక్రాఝర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే జోర్హాట్లో గౌరవ్ గొగోయ్, నాగావ్లో ప్రద్యుత్ బోరోడోలోయ్, గౌహతిలో మీరా బర్తకూర్ గోస్వామి, ధుబ్రిలో రకీబుల్ హుస్సేన్, దీపూలో జైరామ్ ఇంగ్లెంగ్ సహా అస్సాంలోని 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్ చేశాను. అయితే ఇటీవల నా సోషల్ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ను నేను వెంటనే డిలీట్ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్)ట్వీటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. As a routine I upload one sloka of Bhagavad Gita every morning on my social media handles. Till date, I have posted 668 slokas. Recently one of my team members posted a sloka from Chapter 18 verse 44 with an incorrect translation. As soon as I noticed the mistake, I promptly… — Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2023 అయితే సీఎం హిమంత ట్వీటర్ టీం మొదటగా పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి. -
అసోం సీఎం 'హుస్సేన్ ఒబామా' వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
గువాహటి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అనేకమంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని వ్యంగ్యంగా ట్విట్టర్ వేదికగా అన్నారు. అలాంటి వారిని ఎదుర్కోవడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. భారత్లో మైనార్టీల దుస్థితిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఒబామాను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులు వాషింగ్టన్ వెళ్తారా అంటూ ట్విటర్లో వచ్చిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. There are many Hussain Obama in India itself. We should prioritize taking care of them before considering going to Washington. The Assam police will act according to our own priorities. https://t.co/flGy2VY1eC — Himanta Biswa Sarma (@himantabiswa) June 23, 2023 అసోం పోలీసులు స్వీయ ప్రాధామ్యాల ప్రకారం నడుచుకుంటారని బిశ్వశర్మ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విపక్ష నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు ట్విటర్లో ప్రశ్న అడిగారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని ఆయన అడిగారు. దీనిపై అసోం సీఎం వివాదస్పదంగా బదులివ్వడం రాజకీయంగా రగడకు దారితీసింది. సీఎం వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఫైరయ్యారు. భారత్లో మతం ఆధారంగా వివక్ష లేదంటూ అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తి వ్యతిరేకంగా అసోం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం ఈ అంశంలో క్షమాపణలు చెప్పకపోతే ప్రధాని మోదీని ప్రపంచం ఎలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు. ఇదీ చదవండి: మణిపూర్: అమిత్ షా అఖిలపక్ష భేటీ.. ఏపీ, టీఎస్ నుంచి వెళ్లింది వీరే.. -
అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం
బెళగావి: అస్సాంలోని అన్ని మదర్సా (ముస్లిం మత పాఠశాల)లను మూసి వేస్తామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం అవసరం లేదని చెప్పారు. ‘దేశానికి, అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉంది. మదర్సాలతో కాదు’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశాం, మిగతా వాటినీ మూసేస్తామని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో మన సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలి’అని హిమాంత చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించారు. కాంగ్రెస్ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారు..కాంగ్రెస్ ఇప్పుడదే చేస్తోందన్నారు. -
ఆదివాసీల హక్కులపై బీజేపీతో చర్చకు సిద్ధం
అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు. ‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది. -
షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు. అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం. షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు. చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు -
ఆ ఖడ్గమృగం ఇప్పుడు ఎలా ఉంది?.. వీడియో షేర్ చేసిన సీఎం
డిస్పూర్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్లో షేర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ‘అర్జెంట్ అప్డేట్.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్ ద్వారా తీసిన వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning. Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh — Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022 ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్కి ఊహించని షాక్ -
అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’
గౌహతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సంచలన వ్యాఖ్యలే చేశారాయన. ‘‘భారత దేశం ఏకతాటిపైనే ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. సిల్చార్ నుంచి సౌరాష్ట్ర దాకా ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్ యాత్రతో ప్రయోజనం ఏముంటుంది?. కాబట్టి, రాహుల్ ఇలాంటి యాత్రను పాకిస్తాన్లో నిర్వహించుకుంటే మంచిదని హిమంత ఎద్దేశా చేశారు. వాస్తవానికి దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే. ఒకవేళ తన ముత్తాత(నెహ్రూను ఉద్దేశించి) చేసిన పనికి(విజభనను ఉద్దేశించి..) రాహుల్ గాంధీ గనుక పశ్చాత్తపం చెంది ఉంటే గనుక.. భారత్జోడో యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. కావాలనుకుంటే పాక్, బంగ్లాదేశ్లను తిరిగి ఐక్యం చేసి అఖండ భారతాన్ని సృష్టించొచ్చు అని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అస్సాం సీఎం విలీనం వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్లో నాలుగు రోజుల పర్యటనలో ఉండగానే.. ఆయన బంగ్లాదేశ్ విలీనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పర్యటనలో ఉన్న ఆమె ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కూడా. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఏడు ఎంవోయూలపై సంతకాలు కూడా జరిగాయి. అఖండ భారతావని అనేది ఆరెస్సెస్ వాదన. పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, అఫ్గనిస్తాన్, టిబెట్, మయన్మార్లు సంఘటితంగా ఉంటేనే.. అది అఖండ భారతం అని చెప్తుంటుంది.గతంలో కాంగ్రెస్లో ఉన్న హిమంత.. 2015లో బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. #WATCH | "India is intact. We're one nation. Congress disintegrated India in 1947. If Rahul Gandhi has any regret that his grandfather made a mistake, there's no use of Bharat Jodo Yatra in India. Try to integrate Pakistan, Bangladesh & work for Akhand Bharat..," says Assam CM. pic.twitter.com/W1ZbWV4rOG — ANI (@ANI) September 7, 2022 ఇదీ చదవండి: తొలిసారి తండ్రి స్మారకం వద్ద రాహుల్ -
‘మహా’పతనం: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్లో ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘మహా’ సంక్షోభంలో జోక్యం చేసుకోనని చెప్పారు. అసోంకు వచ్చే అతిథులు ఎవరైనా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు. చదవండి: తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు మరో వైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. 16 మందికి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతున్నట్లు సమాచారం. -
Sakshi Cartoon: అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే!
అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే! -
‘డియర్ కేసీఆర్ గారూ’.. అంటూనే కౌంటర్
సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఆధారాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారం డర్టీ పాలిటిక్స్కు తెర తీసింది. రాహుల్ గాంధీకి మద్ధతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని, రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇవాళ అవతలి నుంచి సీఎం కేసీఆర్కు కౌంటర్ పడింది. రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డియర్ కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం. అయినప్పటికీ మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారతదేశం సహించదు అంటూ కూ యాప్లో పోస్ట్ చేశాడాయన. Koo App Dear KCR garu, here is the videographic evidence of the surgical strike by our brave army. In spite of this you question the valor of our Armed forces and insult them. Why are you so desperate to attack and malign our Army? New India will not tolerate insults against our Army. View attached media content - Himanta Biswa Sarma (@himantabiswa) 14 Feb 2022 పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని హిమంత అంటున్నారు. నెహ్రూ కుటుంబం తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని, జీవితకాలమంతా తనను విమర్శించినా పట్టించుకోబోనని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతలు.. హిమంతపై నిప్పులు చెరగ్గా.. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సైతం బీజేపీని డిమాండ్ చేశారు కేసీఆర్. -
‘నేను సీఎంగా కొనసాగడంలో అర్థం లేదు’
గువహటి : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థంలేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయ సేకరణకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఎలాంటి పత్రాలు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత పౌరసత్వ చట్టం 1955ని సవరణ చేస్తూ భారత పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 7 నుంచి 9 వరకు అసోంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బుద్దిస్టులు, జైనులు, పార్శిలు) ఏ విధమైన పత్రాలు లేకుండానే భారత పౌరసత్వ చట్ట (2016) సవరణ చేపట్టనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్న క్రమంలో సోనోవాల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనం, ప్రజల భద్రత సరిగ్గా లేనప్పుడు తాను ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగా’లని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు మేధావులతోను చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోబోనని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాగా బిల్లుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాలు నిర్వహించారు. -
సంస్కరణలతోనే పెట్టుబడులు
గువాహటి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక ఆర్థిక సంస్కరణల కారణంగానే ప్రపంచ పెట్టుబడుల స్వర్గధామంగా భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అస్సాంలోని గువాహటిలో రెండ్రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ను మోదీ శనివారం ప్రారంభించారు. లకి‡్ష్యత కార్యక్రమాలన్నీ అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఎన్డీయే ప్రభుత్వం మార్చిందని తెలిపారు. దీని ద్వారా పనితీరు వేగం పుంజుకుందన్నారు. ఈశాన్య భారతం, ఇక్కడి ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరిగినపుడే దేశ ప్రగతి మరింత వేగం అందుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (తూర్పుదేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల పెంపునకు ఉద్దేశించింది)కి ఈశాన్యరాష్ట్రాలే పట్టుగొమ్మని వెల్లడించారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమైన ‘అడ్వాంటేజ్ అస్సాం: ఆసియాన్కు భారత్ వేగవంతమైన మార్గం’ అనేది కేవలం ప్రకటనే కాదని.. భారత సమగ్ర దృష్టి అని పేర్కొన్నారు. భారత్ వైపు ప్రపంచం చూపు! ‘కేంద్ర ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల వ్యాపారానుకూల విధానాలు సరళతరమయ్యాయి. ప్రపంచ ఆర్థిక ప్రగతికి కేంద్ర స్థానంగా దేశాలన్నీ భారత్వైపే చూస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ద్వారా 45–50 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఆసుపత్రులు మరీ ముఖ్యంగా చైన్ ఆసుపత్రులు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉజ్వల పథకానికి కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకున్నామని.. 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు. వ్యాపారానుకూల నివేదికలోనూ భారత్ 100వ స్థానంలో నిలిచిందని.. ప్రపంచబ్యాంకు జాబితా, అంతర్జాతీయ పోటీ సూచీలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారత్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అస్సాం సీఎం శర్బానంద్ సోనోవాల్, 16 దేశాల రాయబారులు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న అస్సాం.. తమ రాష్ట్రంలో విదేశీ, దేశీయ పెట్టుబడుదారులకు అవసరమైన వాతావరణం, వ్యూహాత్మక అనుకూలతలను సదస్సులో వివరించింది. -
ఎవరినీ వదిలిపెట్టబోం!
గువాహటి: బోడోల్యాండ్లోని కోక్రాఝర్లో తాజాగా చోటుచేసుకున్న తీవ్రవాద నరమేధం నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సరబానంద్ సోనోవాల్ ఆదివారం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ ఉగ్రవాద ఘటనకు కారణం ఎవరైనా వారిని విడిచిపెట్టబోమని, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ప్రజలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని, ఉగ్రవాద పోకడలపై ఎలాంటి కనికరం చూపకపోవడమే తమ విధానమని సీఎం సోనోవాల్ తెలిపారు. గత శుక్రవారం జరిగిన కోక్రాఝర్లో జరిగిన తీవ్రవాద నరమేధంలో 14మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్-సంగ్బిజిత్కు చెందిన స్వయంప్రకటిత కమాండర్ మనోజ్ ఇస్లాహారి ఈ తీవ్రవాద దాడికి పాల్పడ్డాడు. సీఎం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని, బోడో తీవ్రవాద చర్యలను ఎంతమాత్రం సహించబోమని అసోం డీజీపీ ముఖేష్ సహాయ్ తెలిపారు. -
అసోం చేరిన ఎన్ఐఏ బృదం.. బాధితులకు సీఎం పరామర్శ
కోక్రాఝర్ః అసోంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్నినేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ( ఎన్ఐఏ) నలుగులరు సభ్యులు గల బృందం పరిశీలించింది. దాడుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ పరామర్శించారు. కోక్రాఝర్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన దాడిలో 14 మంది పౌరులతో పాటు.. ఓ ఉగ్రవాది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఉగ్రదాడులు జరిగిన సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి శనివారం క్షతగాత్రుల్ని పరామర్శించారు. రాష్ట్రానికీ, దేశానికీ ముప్పును తలపెట్టే ఎవర్నీ ప్రభుత్వం సహించేది లేదని ఆయన టెర్రరిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. దాడులు.. స్వాతంత్రదినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, సూపరింటిండెంట్ల తో సహా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అసోంలోని రద్దీగా ఉండే కోక్రాఝర్ మార్కెట్ ప్రాంతానికి శుక్రవారం మధ్యాహ్నం కారులో వచ్చిన సాయుధ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో దగ్గరల్లోనే గస్తీ నిర్వహిస్తున్న సైనికులు.. గ్రైనేడ్ల చప్పుడుకు అక్కడకు చేరుకొని ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మరణించగా మిగిలినవారు తప్పించుకున్నారు. మరణించిన మిలిటెంట్ పేరు మోన్ జాయ్ ఇస్లారీగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దాడి వెనుక బోడో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్ఐఏ బృందం ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలిని పరిశీలించి విచారణ జరుపుతోంది. రద్దీగా ఉండే బలిజన్ తినియాలీ వీక్లీ మార్కెట్ కు కారు నిండుగా మారణాయుధాలతో వచ్చిన మిలిటెంట్లు.. శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలో దాడులు జరుపగా 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు. దాడుల్లో మరో 20 మందివరకూ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దాడుల వెనుక నేషనల్ డిమొక్రెటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ హస్తం ఉండవచ్చని అసోం డీజీపీ ముఖేష్ సహాయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంనుంచీ ఏకే-56, 47 సిరీస్ రైఫిల్స్ తోపాటు గ్రెనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ యూనిఫాం వంటి దుస్తులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు ముఖం కనిపించకుండా కట్టుకొని వ్యాన్ లో మార్కెట్ ప్రాంతానికి చేరుకొన్నారని, సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు స్థానిక దుకాణం యజమాని, ప్రత్యక్ష సాక్షి, 30 ఏళ్ళ మానిక్ దేబనాథ్ తెలిపారు. మిలిటెంట్లు విసిరిన గ్రెనేడ్ వల్ల ఎనిమిది దుకాణాలకు నిప్పంటుకుందని, దీంతో జనం భయంతో అక్కడినుంచీ తప్పించుకునేందుకు పరుగులు తీశారని మానిక్ తెలిపాడు. -
అస్సాం, మేఘాలయలోనే దక్షిణాసియా క్రీడలు
గువాహటి : దక్షిణాసియా క్రీడలను అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనే జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఈవెంట్ నవంబర్లో జరుగనుంది. ‘ గేమ్స్ విషయంలో కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలని అస్సాం సీఎం కోరారు. మా తరఫు నుంచి ఈ రెండు రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఉంటుంది. భారత ఒలింపిక్ సంఘం అధికారులను ఢిల్లీకి పిలిచి ఆతిథ్యం, నిర్వహణ కమిటీల ఏర్పాటు గురించి చర్చించాల్సిందిగా క్రీడా శాఖ కార్యదర్శికి సూచించాను’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. -
అసోం CM గొగోయ్ కాన్వాయ్ పై రాళ్ళదాడి


