
అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్
గువహటి : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థంలేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయ సేకరణకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఎలాంటి పత్రాలు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత పౌరసత్వ చట్టం 1955ని సవరణ చేస్తూ భారత పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 7 నుంచి 9 వరకు అసోంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బుద్దిస్టులు, జైనులు, పార్శిలు) ఏ విధమైన పత్రాలు లేకుండానే భారత పౌరసత్వ చట్ట (2016) సవరణ చేపట్టనున్నారు.
దీనిపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్న క్రమంలో సోనోవాల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనం, ప్రజల భద్రత సరిగ్గా లేనప్పుడు తాను ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగా’లని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు మేధావులతోను చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోబోనని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాగా బిల్లుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాలు నిర్వహించారు.