దుబాయ్లో ఆస్తులు, అమెరికాలో కంపెనీ
కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
ఖండించిన హిమంత బిశ్వ శర్మ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ మూడు దేశాల పాస్పోర్టులు కలిగి ఉన్నారని, దుబాయ్లో ఆమె పేరిట ఆస్తులు, అమెరికాలో కంపెనీ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ఆదివారం మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు.
ఆమెకు దుబాయ్, అంటిగ్వా బార్బుడా, ఈజిప్టు పాస్పోర్టులున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారా? అంటూ ఖేరా ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపారు. సీఎం శర్మ భార్య పేరుతో అమెరికాలో ఓ కంపెనీ ఉందని చెప్పారు. ఈ వివరాలను దాచినందుకు గాను ఎన్నికల కమిషన్ సీఎం శర్మ నామినేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. వచ్చే 48 గంటల్లోగా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖేరా చూపుతున్న పత్రాల్లోని వివరాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి నిస్పృహతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం శర్మ ఆరోపించారు.


