మకర మాధుర్యం | Sakshi
Sakshi News home page

మకర మాధుర్యం

Published Fri, Jan 10 2014 11:48 PM

sankranti special sweets

సంక్రాంతి... ఒక పండుగ కాదు!
 పాడి పంటల పండుగ
 ముగ్గు ముచ్చట్ల పండుగ
 గొబ్బెమ్మలు, గంగిరెద్దుల పండుగ
 కొత్త అల్లుళ్ల పండుగ
 పాయసం, పరమాన్నాల పండుగ
 తియ్యని పిండి వంటల పండుగ.
 మొత్తంగా...
 మకరం తెచ్చే మధురమైన పండుగ!
 ముందైతే అరిసెలు మొదలుపెట్టండి.
 ఆదిత్యుడు అతిథిగా వచ్చేలోపు...
 జంతికలు, మిగతా ‘సంక్రాంతికలు’పూర్తి చెయ్యొచ్చు!

 
 కజ్జి కాయలు


 కావలసినవి :::
మైదా - పావు కేజీ, కొబ్బరితురుము - 100 గ్రా., బెల్లం తురుము - 150 గ్రా., ఏలకులపొడి - టేబుల్ స్పూను, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా
 
 తయారి:  
 ఒక పాత్రలో మైదాపిండి, తగినంత నీరు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో కొబ్బరితురుము, బెల్లంతురుము, ఏలకులపొడి వేసి, స్టౌ మీద ఉంచి ఉడికించి దించేయాలి  
 
 చల్లారాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి
 
 మైదాను కొద్దికొద్దిగా తీసుకుని చిన్నసైజు పూరీలా ఒత్తాలి  
 
 కజ్జికాయలు తయారుచేసే అచ్చులో ఆ పూరీని ఉంచి, అందులో కొబ్బరి ఉండను ఉంచి అచ్చు మూసేసి, అంచులు తీసేయాలి. (ఇలా అన్నీ తయారుచేసుకోవాలి)  


 స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఒక్కో కజ్జికాయను వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి
 
 చల్లారాక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి  
 
 (గమనిక: స్టఫ్‌గా కొబ్బరి ఉండలే కాకుండా, పుట్నాలపప్పుపొడి + కొబ్బరితురుము + బెల్లంతురుము కలిపిన మిశ్రమంతో తయారుచేసుకోవచ్చు. ఇంకా... బొంబాయిరవ్వను దోరగా వేయించి అందులో పంచదార, ఏలకులపొడి కలిపి కేసరిలా చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు)
 
 గుమ్మడికాయ బొబ్బట్లు
 
 కావలసినవి :::
శనగపప్పు -పావుకేజీ, మైదాపిండి - పావుకేజీ, బెల్లం - పావుకేజీ, గుమ్మడికాయ తురుము - కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, నూనె - తగినంత
 
 తయారి:  
 ఒక పాత్రలో మైదాపిండి వేసి, తగినంత నీరు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి  
 
 పైన నూనె వేసి బాగాకలిపి సుమారు రెండు గంటలసేపు నాననివ్వాలి  
 
 ఒక పాత్రలో శనగపప్పు, తగినంత నీరు పోసి పప్పు ఉడి కించి పక్కన ఉంచాలి  బాణలిలో నెయ్యి వేసి కరిగాక గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి  
 
 బెల్లం తురుము, ఏలకుల పొడి జతచేసి బాగా గట్టిపడేవరకు ఉంచి దించేయాలి  
 
 ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచాలి
 
 మైదాను చిన్న చిన్న ఉండలుగా చేయాలి  
 
 ఒక్కో వుండను ఒత్తి, మధ్యలో పూర్ణం ఉంచాలి  
 
 ప్లాస్టిక్ కవర్‌కి నూనె రాసి, ఈ ఉండను దాని మీద ఉంచి, చేతితో పల్చగా ఒత్తాలి  
 
 స్టౌ మీద పెనం ఉంచి, తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్టును దాని మీద వేసి రెండు వైపులా కాల్చి తీసేయాలి.
 
 అరిసెలు


 కావలసినవి::: బియ్యం - కిలో, బెల్లం - అరకిలో, నువ్వుపప్పు - 50 గ్రా., నూనె - తగినంత.(పాకంలో పట్టినంత బియ్యప్పిండి మాత్రమే వేయాలి. ఎక్కువ తీపి కావాలనుకుంటే బెల్లం మరికాస్త వేయచ్చు)
 
 తయారి:  
 ముందురోజు బియ్యం నానబెట్టాలి. మర్నాడు బియ్యంలోని నీటిని వడగట్టి, మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టాలి
 
 బాగా జల్లెడపట్టాలి  
 
 బెల్లానికి తగినంత నీరు జత చేసి స్టౌ మీద ఉంచి ఉండపాకం వచ్చే వరకు కలుపుతుండాలి (చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా పాకం వేసి చేత్తో మెదిపితే ఉండలా వస్తే ఉండపాకం వచ్చినట్టు)  
 
 పాకం కిందకు దింపి అందులో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి  
 
 కలిపిన పిండిలో చిన్నగిన్నెడు నూనె పోసి ఉంచాలి  
 
 ఒక గిన్నెలో నువ్వుపప్పు, కొద్దిగా నూనె వేసి కలిపి ఉంచుకోవాలి (ఇలా చేయడం వల్ల నువ్వులు విడిపోకుండా ఉంటాయి)  
 
 బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి కాగనివ్వాలి  
 
 పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నువ్వుపప్పులో ముంచి తీసి, చిన్న పాలిథిన్ కవర్ మీద ఉంచి, చేతితో పల్చగా వచ్చేలా ఒత్తి నూనెలో వేయాలి
 
 రెండువైపులా కాలాక తీసేయాలి  
 
 అరిసెల చట్రం మీద ఉంచి నూనె పోయేలా గట్టిగా ఒత్తాలి
 
 బాగా ఆరిన తరవాత గాలి చొరని డబ్బాలో భద్రపరచాలి.
 
 పాకం ఉండలు
 
 కావలసినవి:::
 బియ్యం - 250 గ్రా., బెల్లంతురుము - 100 గ్రా., ఏలకులపొడి - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
 
 తయారి:  
 ఒక గిన్నెలో చిన్నగ్లాసుడు నీరు పోసి మరిగించాలి  
 
 ఏలకులపొడి, బెల్లంతురుము వేసి కరిగేవరకు ఉంచాలి  
 
 బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి  
 
 బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి
 
 పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో వేసి వేయించి తీసేయాలి.

- డా.వైజయంతి
 

Advertisement
Advertisement