
వరలక్ష్మి వ్రతం.. 29కి బంద్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్ను ఒకరోజు వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్ను ఒకరోజు వాయిదా వేశారు. వాస్తవానికి ఈనెల 28వ తేదీన బంద్ నిర్వహించాలని పిలుపునివ్వగా, అదే రోజు వరలక్ష్మి వ్రతం ఉంది. శ్రావణమాసంలో మహిళలు చాలా పవిత్రంగా భావించే ఈరోజున బంద్ పాటించడం భావ్యం కాదని, తర్వాతి రోజైన 29వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు.
కాగా, వైఎస్ఆర్సీపీ ధర్నాతో స్పెషల్ ప్యాకేజిలంటూ టీడీపీ నేతలు కొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చారని బొత్స మండిపడ్డారు. ఈ ప్యాకేజీలు టీడీపీ నేతలు పంచుకోడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, అందుకే.. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఆయన ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు.