కాంగ్రెస్లో చేరిన విజయశాంతి
ఢిల్లీ: మెదక్ లోక్సభ సభ్యురాలు విజయశాంతి ముందు నుంచి ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్సింగ్తో కలిసి ఆమె విలేకరుతో మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, అలాగే తెలంగాణ ఇస్తే మీతో కలిసి పనిచేస్తానని తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నానన్నారు.
రాజకీయ నాయకులు ఎవరైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని విజయశాంతి చెప్పారు. చాలా మంది అన్న మాటలను నిలబెట్టుకోలేకపోతున్నారన్నారు. ఏదేదో మాట్లాడుతున్నారని, అది మంచి పద్దతి కాదని చెప్పారు. గతంలో చెప్పిన దానికి కట్టుబడాలన్నారు. తాను 16 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కష్టపడ్డానని చెప్పారు. 98 నుంచి తన పోరాటం ప్రారంభమైందని, అప్పటి నుంచి సరైనదారిలోనే నడుస్తున్నట్లు తెలిపారు. మాట తప్పితే ప్రజలు నమ్మరన్నారు. గెలుపు ఓటములు, పదవులు ఇవన్నీ రాజకీయాలలో మామూలే అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం ముఖ్యం అని చెప్పారు.
తాను భక్తురాలినని, శివరాత్రి చాలా మంచి రోజుని, అందువల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మెదక్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అభినందనలు తెలిపారు. మెదక్ నుంచి పోటీ చేస్తారన్న అన్న విలేకరుల ప్రశ్నకు పోటీ చేయడం ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని విజయశాంతి చెప్పారు.