ఉద్యోగులపై వేటు వేయనున్న ట్విట్టర్ | Twitter to lay off 9 percent of staff | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై వేటు వేయనున్న ట్విట్టర్

Oct 27 2016 7:08 PM | Updated on Sep 4 2017 6:29 PM

ఉద్యోగులపై వేటు వేయనున్న ట్విట్టర్

ఉద్యోగులపై వేటు వేయనున్న ట్విట్టర్

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను కొనేవారు కరువవ్వడంతో, తానే ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఆ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను కొనేవారు కరువవ్వడంతో,  తానే ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకోవాలని ఆ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్థికనష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని లాభదాయకత వైపు మరల్చుకోవడానికి, ఉద్యోగాలపై వేటు వేయాలని నిర్ణయించింది. కంపెనీలోని 9 శాతం ఉద్యోగాలపై కోత విధించనున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఈ కోత ప్రభావంతో దాదాపు 350 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఉద్యోగాల కోత ఎక్కువగా సేల్స్, పార్టనర్షిప్ డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్లలో ఉండనుందని కంపెనీ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. నాన్-కోర్ ఏరియాలో పెట్టుబడులు తగ్గిస్తూ.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వాటిలో పెట్టుబడులు కొనసాగించడమే ఈ పునర్నిర్మాణం ముఖ్య ఉద్దేశ్యమని తమ షేర్హెల్డర్స్ సమావేశంలో డోర్సే పేర్కొన్నారు..  కాగ, ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్కు 3,860 మంది ఉద్యోగులున్నారు. 
 
కంపెనీ ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల కోత అంశాన్ని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి యేటికేటీకి తన క్వార్టర్లీ రాబడులను 8 శాతం పెంచుకుని, 616 మిలియన్ డాలర్లను(రూ.4,114 కోట్లకు పైగా) నమోదుచేసింది. అదేవిధంగా గతేడాది కంటే యాక్టివ్ యూజర్లను 3 శాతం పెంచుకుని నెలకు 317 మిలియన్ యూజర్లను కలిగిఉన్నట్టు తెలిపింది. కానీ లాభాలను ఆర్జించడంలో మాత్రం కంపెనీ విఫలమైంది. గత క్వార్టర్లో ట్విట్టర్ 103 మిలియన్ డాలర్లు(688 కోట్లకు పైగా) నికర నష్టాలను మూటకట్టుకున్నట్టు ప్రకటించింది. గతేడాది కూడా 336 ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. గత నెలే బెంగళూరులోని ఇంజనీరింగ్ ఉద్యోగులు 20 మందికి కూడా ట్విట్టర్ గుడ్ బై చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement