హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ఓ వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందేవిధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలో నివసించే గూడెపు భాస్కర్సాయి (22) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ‘ఎక్స్’లో చిరంజీవి ఫొటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్ చేశాడు.
ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూరిబాబుకు ఫోన్ చేసి ఆ ఫొటోను, పోస్ట్ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్ను అలాగే కొనసాగించాడు. ఈ ఫొటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


