మన్యం మంటలు | today vishaka manayam bandh | Sakshi
Sakshi News home page

మన్యం మంటలు

Nov 7 2015 7:24 AM | Updated on May 28 2018 4:17 PM

మన్యం మంటలు - Sakshi

మన్యం మంటలు

బాక్సైట్ తవ్వకాలకు రాష్ర్టప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం మండి పడుతోంది.

* బాక్సైట్ తవ్వకాలపై ప్రజాగ్రహం
* విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు.. నేడు మన్యం బంద్
సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు రాష్ర్టప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం మండి పడుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని పాడేరులో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శనివారం మన్యం బంద్‌కు పిలుపు నిచ్చింది.  ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక నుంచి ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని తీర్మానించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన సర్కార్..

ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు పోలీసుల నిర్బంధాలు, తప్పుడు కేసులు బనాయించడం వంటి  చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముగ్గురు ఆదివాసీలను మావోలు కిడ్నాప్ చేసినప్పుడు తవ్వకాలు జరపబోమని అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన చుట్టూ ఉండే పారిశ్రామిక కోటరీ కోసం అనుమతులిచ్చారని ఆమె విమర్శించారు. తొలుత అఖిల పక్షం ఆధ్వర్యంలో పాడేరులో  బైక్ ర్యాలీ చేశారు.
 
ఉన్నతాధికారుల ఏరియల్‌సర్వే
బాక్సైట్ తవ్వకాలకై జీవో జారీ చేసిన మర్నాడే సీఆర్‌పీఎఫ్ ఏడీజీ(అడిషనల్ డెరైక్టర్ జనరల్) పి.వి.కె.రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు (ఏవోబీ)  ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీ నుంచి  చేరుకున్న ఈ బృందం ముంచంగిపుట్టు, మల్కన్‌గిరిలలో  సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులను తనిఖీ చేసింది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement