breaking news
Vishakha Manyam
-
భయోత్పాతం.. భీతావహం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. రామ్గుడ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రజాప్రతినిధితో పాటు, మాజీ ప్రజాప్రతినిధిని కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. అయితే రామ్గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్ను హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. ఒకవైపు గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసినా.. పలు హింసాత్మక చర్యలకు పాల్పడడమేగాక వారోత్సవాలు జరపడం, పోస్టర్లు వేయడం వంటి చర్యల ద్వారా వారు తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపి భయోత్పాతాన్ని సృష్టించారు. మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతోపాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. రామ్గుడ ఎన్కౌంటర్ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్ టీమ్ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్యంలో భయంభయం ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. తమ బలం నిరూపించేందుకు మావోయిస్టులు తెగబడిన ఈ ఘటన మన్యంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గిరిసీమలు వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో గ్రామస్తులు బితుకుబితుకుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన దరిమిలా ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలా ఉంటుందోననే భయంతో మారుమూల గూడేల్లోని ప్రజలు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు. డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరికొన్ని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 2014లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలపై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు. సుకుమా జిల్లాలో జరిపిన దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం సంఘటనలు – 155 చనిపోయిన పౌరులు – 128 మరణించిన భద్రతాసిబ్బంది – 87 2015లో ఛత్తీస్గఢ్ మందు పాతరలు, ఎన్కౌంటర్లతో దద్దరిల్లింది. మొత్తం సంఘటనలు – 118 చనిపోయిన పౌరులు – 93 చనిపోయిన భద్రతాసిబ్బంది – 57 2016లో ఛత్తీస్గఢ్లో దాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువ ఘటనలు జరిగాయి. మొత్తం సంఘటనలు – 69 మొత్తం చనిపోయిన పౌరులు – 123 మొత్తం చనిపోయిన భద్రతాసిబ్బంది – 66 -
మన్యం మంటలు
* బాక్సైట్ తవ్వకాలపై ప్రజాగ్రహం * విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు.. నేడు మన్యం బంద్ సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు రాష్ర్టప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం మండి పడుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని పాడేరులో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శనివారం మన్యం బంద్కు పిలుపు నిచ్చింది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక నుంచి ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని తీర్మానించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన సర్కార్.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు పోలీసుల నిర్బంధాలు, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముగ్గురు ఆదివాసీలను మావోలు కిడ్నాప్ చేసినప్పుడు తవ్వకాలు జరపబోమని అర్ధరాత్రి ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన చుట్టూ ఉండే పారిశ్రామిక కోటరీ కోసం అనుమతులిచ్చారని ఆమె విమర్శించారు. తొలుత అఖిల పక్షం ఆధ్వర్యంలో పాడేరులో బైక్ ర్యాలీ చేశారు. ఉన్నతాధికారుల ఏరియల్సర్వే బాక్సైట్ తవ్వకాలకై జీవో జారీ చేసిన మర్నాడే సీఆర్పీఎఫ్ ఏడీజీ(అడిషనల్ డెరైక్టర్ జనరల్) పి.వి.కె.రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చేరుకున్న ఈ బృందం ముంచంగిపుట్టు, మల్కన్గిరిలలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను తనిఖీ చేసింది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.