ఆంధ్రప్రదేశ్లో తెలుగు యూనివర్సిటీకి చెందిన మూడు ప్రాంగణాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని ఏపీ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో తెలుగు యూనివర్సిటీకి చెందిన మూడు ప్రాంగణాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని ఏపీ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.పి.విజయప్రకాశ్, ప్రొ.పి.నరసింహారావు, ఉన్నత విద్యాశాఖ డిప్యుటీ కార్యదర్శి నీలకంఠనాధరెడ్డి పాల్గొన్నారు.
3 ప్రాంగణాలకు సంబంధించి 2015 ఆగస్టు నుంచి 2016 మార్చి వరకు సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు రూ. 4,34,67,616 ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ఉన్నత విద్యాశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణకు రూ. 80 లక్షలను వర్సిటీకి విడుదల చేయాలని, 2014 జూన్ నుంచి 2015 జులై వరకు ఇవ్వాల్సిన బకాయి రూ. 6,03,53,560 మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఈ లేఖపై సమావేశంలో చర్చించి 2016 మార్చి వరకు జీతభత్యాలు, పరీక్షల నిర్వహణకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. వర్సిటీ రిజర్వుడ్ నిధుల్లో ఏపీ వాటా కూడా ఉన్నందున వాటి లెక్క తేల్చే సమయంలో పాత బకాయిలను సర్దుబాటు చేస్తామని తెలంగాణకు లేఖ రాయనున్నారు.అదే విధంగా అంబేడ్కర్ వర్సిటీకి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్తో సుమితా దావ్రా మాట్లాడారు. అక్కడి నుంచి ప్రతిపాదనలు రాగానే నిధులు విడుదల చేయనున్నారు.