
పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు శివపాల్ యాదవ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని శుక్రవారం ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు శివపాల్ యాదవ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని శుక్రవారం ప్రకటించారు. అన్న కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో వివాదం కారణంగా పార్టీలో చీలికల ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
లక్నోలో జరిగిన జిల్లా స్ధాయి నేతల సమావేశంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ వారంలో సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం సమావేశాలను ఏర్పాటు చేయడం ఇది మూడోసారి. కాగా, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అఖిలేశ్ హాజరుకాలేదని ఎస్పీ అధికార ప్రతినిధి దీపక్ మిశ్రా తెలిపారు.
తాను పార్టీ అధ్యక్షుడిగా పదవి చేపట్టడమే ముసలానికి కారణమైతే రాజీనామాకు సిద్ధమని శివపాల్ యాదవ్ సమావేశంలో చెప్పినట్లు మిశ్రా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే అఖిలేశే మరోసారి సీఎం అవుతారని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బెని ప్రసాద్ వర్మ సీఎం, పార్టీ అధ్యక్షుల మధ్య వివాదం పార్టీలో చీలికకు కారణం కాబోదనే నమ్మకం ఉందని అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ తో తాను మాట్లాడనని చెప్పుకొచ్చిన వర్మ ఆయన కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కనిపించారని చెప్పారు. ములాయం, అఖిలేశ్ లతో తాను మాట్లాడుతానని తెలిపారు. దాదాపు 90మందికి పైగా పార్టీ లీడర్లతో శివపాల్ మూడు గంటలకు పైగా చర్చించారు. సమావేశానికి మీడియాను అనుమతించ లేదు.
సమావేశానికి విచ్చేసిన నాయకుల ఫోన్ లను హాల్ లోకి అనుమతించలేదు. కాగా ఎస్పీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ శనివారం సమావేశం కానుంది. ఈ నెల 24న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ములాయం భేటీ కానున్నారు.