ఎంపీ లగడపాటి రాజగోపాల్కు సొంతూరులోనే చుక్కెదురైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ బెజవాడలో ఆర్టీసీ కార్మికులు నిలదీశారు.
సాక్షి నెట్వర్క్: ఎంపీ లగడపాటి రాజగోపాల్కు సొంతూరులోనే చుక్కెదురైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ బెజవాడలో ఆర్టీసీ కార్మికులు నిలదీశారు. బుధవారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఏపీ ఎన్జీవోల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీని చూడగానే ఆర్టీసీ కార్మికుల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమైక్యం కోసం తాము జీతాలు, ఉద్యోగాలు కూడా పణంగా పెట్టి ఉద్యమం చేస్తుంటే రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడతారా అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ మోహరించిన పోలీసులు ఎంపీని సురక్షితంగా శిబిరం నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో నిరాహార దీక్ష కోసం ఏర్పాటు చేసిన షామియానాలు కుప్పకూలిపోయాయి. కాగా, మంత్రి కొలుసు పార్ధసారథిని సైతం మహిళలు కృష్ణలంకలో చుట్టుముట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తులసిరెడ్డిపై చెప్పు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటైన సమావేశానికి వచ్చిన రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డికి పరాభవం ఎదురైంది. ఆయన సమైక్యవాదుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా, రాజీనామాలు ఆమోదించుకుని వచ్చి మాట్లాడాలని జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు యత్నించగా అక్కడా అడ్డుకున్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి కారుపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొడగొట్టి మీసం తిప్పారు. కాగా, కేంద్ర సహాయమంత్రి పనబాకలక్ష్మి గత 50రోజుల నుంచి కనబడటం లేదంటూ గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీస్స్టేషన్లో గుడుపూడి గ్రామానికి చెందిన సమాచార హక్కుచట్టం రాష్ట్ర కార్యదర్శి నలజాల వేదవ్యాస్ ఫిర్యాదు చేశారు.