పెండింగ్ రాజ్! | pending files are increasing in secretariat | Sakshi
Sakshi News home page

పెండింగ్ రాజ్!

Jul 18 2015 2:57 AM | Updated on Oct 2 2018 3:04 PM

పెండింగ్ రాజ్! - Sakshi

పెండింగ్ రాజ్!

తెలంగాణ సచివాలయంలో పాలన పడకేసింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆమోదం తెలపాల్సిన కీలక ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

- సచివాలయంలో నిలిచిపోయిన కీలక ఫైళ్లు
- పాలన పడక.. నెలరోజులుగా క్లియరెన్స్‌కు నోచుకోని ఫైళ్లు
- హామీలన్నీ ఎక్కడివక్కడే.. అన్ని విభాగాల్లో స్తబ్దత
- నోటిఫికేషన్లు లేక లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన
- ఇంకా తేలని పరీక్షల విధానం, వయో పరిమితి పెంపు
- ‘క్రమబద్ధీకరణ’ కలల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులు
- కదలని పీఆర్‌సీ ఫైలు..
- వర్సిటీలు, హైకోర్టు సిబ్బందికి పెరగని జీతాలు
- వీసీల నియామకం లేక గాడితప్పుతున్న యూనివర్సిటీలు
- ఆరు నెలలైనా ఉద్యోగులకు అందని కరువు భత్యం
- ఇప్పటికీ ఖరారు కాని సర్వీసు రూల్స్, జోనల్ విధానం
 
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ సచివాలయంలో పాలన పడకేసింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆమోదం తెలపాల్సిన కీలక ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలకు సంబంధించిన ఫైళ్లు మోక్షానికి నోచుకోవటం లేదు. నెల రోజులుగా సీఎంవో కార్యాలయంలో ఫైళ్ల క్లియరెన్స్ దాదాపుగా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్)కు వచ్చే దరఖాస్తులు తప్ప సచివాలయంలో మిగతా కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి.

గతనెల 23 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో అన్ని విభాగాల్లో స్తబ్దత నెలకొంది. గడచిన నెల రోజుల్లో హరితహారం, గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలపైనే ప్రభుత్వం దృష్టి సారించటంతో మిగతా కార్యకలాపాలు, ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికక్కడే ఉండిపోయాయి. రాష్ట్ర ఖజానా ఇబ్బందుల్లో ఉండటంతో నిధులతో ముడిపడి ఉన్న ఫైళ్లన్నీ ముందుకు కదలడం లేదని అధికారులు సైతం నిట్టూరుస్తున్నారు.

నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?
జూలైలో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని, నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వీటిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈనెలలో నోటిఫికేషన్లు వెలువడుతాయో, లేదో అన్న సందిగ్ధత నిరుద్యోగులను వెంటాడుతోంది. అభ్యర్థుల వయో పరిమితి పెంపు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల విధానంపై మంత్రుల సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలు సీఎం కార్యాలయం వద్దే ఆగిపోయాయి. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు.

అయోమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు
జూలై నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రారంభిస్తామని సీఎం చేసిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. స్థానికులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, వారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని సీఎం ప్రకటించి నెల దాటింది. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం పేషీలో ఆమోదానికి సిద్ధంగా ఉంది. సీఎం ఆమోదం పొందని కారణంగా ఆ నోటిఫికేషన్ వెలువడలేదు.

ఆమోదానికి నోచుకోని డీఏ ఫైలు
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (డీఏ) ఫైలు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. జనవరి నుంచి అమలు చేయాల్సిన కరువు భత్యం సాధారణంగా మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఆలస్యంగా జూలైలోనూ అందకపోవటంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 3.144 శాతం డీఏ ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు సీఎం పేషీలో ఆగిపోయింది.

గండాలు దాటని పీఆర్‌సీ
ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన తెలంగాణ సర్కారు.. ఉత్తర్వుల జారీలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో రెండు లక్షల మందికి పైగా పెన్షనర్లు గందరగోళంలోఉన్నారు. వయసు పైబడే కొద్దీ చెల్లించే అదనపు పెన్షన్‌పై ఆర్థిక శాఖ కొర్రీ పెట్టింది. దీంతో సీఎం తుది నిర్ణయం కీలకంగా మారింది. గ్రాట్యుటీకి సంబంధించి ఉత్తర్వులు కూడా రాకపోవటంతో ఇటీవల రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ రావటం లేదు. పెరిగిన పెన్షన్ ఒకసారి, గ్రాట్యుటీ మరోసారి ఇచ్చేందుకు అకౌంటెంట్ జనరల్ కార్యాలయం అభ్యంతరం తెలిపింది. దీంతో రిటైరైన ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు. పీఆర్‌సీ తొమ్మిది నెలల బకాయిలపైనా ప్రభుత్వం ఊసెత్తటం లేదు. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో రెండేళ్ల పాటు చైల్డ్ కేర్ లీవ్‌ను పీఆర్‌సీ సిఫారసు చేసింది. వికలాంగులైన ఉద్యోగులకు పీహెచ్ అలవెన్స్ పెంచింది. ఈ జీవోలేవీ విడుదల కాలేదు.

యూనివర్సిటీల్లో ఆందోళన
యూనివర్సిటీ సిబ్బంది, హైకోర్టు సిబ్బందికి పీఆర్‌సీ ఇప్పటికీ అమలు కాలేదు. ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఈ ఫైళ్లు సీఎం కార్యాలయంలోనే ఆగిపోయాయి. దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఇన్‌చార్జిల పాలనతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పింది. వైస్ చాన్స్‌లర్లు, పాలక మండలి నియామకం విషయాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. చట్టం సవరిస్తే తప్ప కొత్త వీసీలు, పాలక మండళ్లను నియమించే అవకాశం లేదని చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కాలేదు.

సర్వీస్ రూల్స్, జోన్ల విధానంపై అస్పష్టత
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను సరళీకృతం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న జోన్ల విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తారా.. పునర్విభజిస్తారా..? అన్నది తేల్చడం లేదు. నియామకాలు, బదిలీలన్నింటికీ ఇదే కీలకమైన అంశం కావటంతో నిరుద్యోగులు, ఉద్యోగులందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement