డీజిల్ ధరలు త్వరలోనే లీటరుకు రూ.3 వరకూ పెరగనున్నాయి. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేవారం ముగిసిన వెంటనే డీజిల్పై వడ్డనకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు త్వరలోనే లీటరుకు రూ.3 వరకూ పెరగనున్నాయి. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేవారం ముగిసిన వెంటనే డీజిల్పై వడ్డనకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం అవుతుండటంతో ప్రభుత్వంపై చమురు సబ్సిడీ భారం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్ ధరలను పెంచే అవకాశాలున్నాయి. అయితే ధరల పెంపుదలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదన లేదని, కానీ రూపాయి పతనం కావడం మాత్రం ఆందోళనకరమేనని మంగళవారమిక్కడ పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ అన్నారు. ఇప్పటికైతే ధరల పెంపు లేదని, భవిష్యత్తులో సంగతి చెప్పలేనన్నారు. మంగళవారం ఒక డాలరుకు రూపాయి విలువ 66 నుంచి పతనమై 66.24 వద్ద ముగిసింది.
దీంతో ప్రభుత్వ చమురు కంపెనీలు ముడిచమురు దిగుమతి కోసం మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా రిటైల్ ధరలు కూడా పెంచకపోతే ఆ మేరకు ప్రభుత్వమే లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా, నష్టాలు భర్తీ అయ్యేంతవరకూ ప్రతినెలా లీటరుపై 50 పైసల చొప్పున పెంచేందుకుగాను కంపెనీలకు గత జనవరిలో కేంద్రం అనుమతించిం ది. అయినా.. రూపాయి పతనం వల్ల ప్రస్తుతం లీటరు డీజిల్పై రూ.10.22 వరకూ నష్టం వస్తున్నట్లు అంచనా. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒకేసారి భారీ మొత్తంలో ధరను పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. చివరిగా ఆగస్టు 1న 56 పైసలు పెంచడంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.51.40కి చేరింది.