సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు మూడేసి రూపాయాల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. సీఎన్జీపైనా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6గం. నుంచే అమల్లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంధన భారం అధికంగా కొనసాగుతుండడం గమనార్హం.
అమెరికా-ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయింది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపునకు కేంద్రం అనుమతి ఇస్తోంది. తాజాగా పెట్రోల్పై లీటర్కు రూ.2.61 పైసలు, డీజిల్పై రూ.2.71పైసలు చొప్పున పెంచారు. మొత్తంగా పదిరోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచేశారు.
మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపు
మే 19.. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంపు
మే 23.. 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంపు
మే 25.. రూ.2.61 పైసలు.. డీజిల్పై రూ.2.71 పైసలు పెంపు
అంటే ఇప్పటివరకు.. అదీ పదిరోజుల వ్యవధిలో పెట్రోల్పై లీటర్కు రూ.7.34, డీజిల్పై లీటర్కు రూ.7.45 పెరిగిందన్నమాట.
తాజా రేట్లు (పెట్రోల్ రూ.2.61, డీజిల్ రూ.2.71 పెంపు కలిపి):
ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12
ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48
హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76
కోల్కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47
చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84
బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44
పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23
జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94
తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71
చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90
విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79
విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94
తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. నౌకా రవాణా అంతరాయం వల్ల అధిక ధరలకు క్రూడాయిల్ను కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు చెబుతూ వచ్చాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని, వాటిని ఎక్కువకాలం భరించడం సాధ్యం కావట్లేదని ఆయిల్ సంస్థలు కేంద్రానికి వివరించాయి.

ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసి ధరల పెంపును నియంత్రించే ప్రయత్నం చేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు ధరల సవరణలు తప్పవని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకపోవడం, హర్ముజ్ ప్రాంతంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో కూడా ఇంధన ధరలు దశలవారీగా మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చేసిన పెంపు మాత్రమే సరిపోదని, ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఇంకొన్నిరోజులపాటు ధరల పెంపులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.


