Sakshi News home page

పదికోట్ల భారతీయులకు ఒక్కో నిమిషం వంతున..!

Published Sat, Sep 26 2015 9:05 AM

పదికోట్ల భారతీయులకు ఒక్కో నిమిషం వంతున..! - Sakshi

ఐక్యరాజ్య సమితి
దేశ జనాభా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది! అవును.. ఈ విషయం ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సాక్షిగా రుజువైంది. ప్రధాని నరేంద్రమోదీకి సర్వప్రతినిధి సభలో ప్రసంగించడానికి తొలుత కేవలం 10 నిమిషాలు మాత్రమే కేటాయించారు. అయితే, తనదైన శైలిలో ఉద్వేగభరితంగా హిందీలో ప్రసంగం ప్రారంభించిన నరేంద్ర మోదీ.. తనకు కేటాయించిన సమయం కంటే, 13 నిమిషాలు అదనంగా మాట్లాడారు. సాధారణంగా ఎంత పెద్ద నాయకుడైనా సరే, కేటాయించిన సమయం దాటితే వెంటనే అక్కడున్న సదస్సు చైర్మన్లు అప్రమత్తం చేస్తారు.

కానీ, ఈసారి సదస్సుకు కో-చైర్మన్గా వ్యవహరిస్తున్న ఉగాండా అధ్యక్షుడు యొవెరి ముసువెని మాత్రం మోదీకి 13 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చేశారు. ఇదేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, భారత దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారని, పదికోట్ల మందికి ఒక్కో నిమిషం చొప్పున అనుకుని అదనంగా సమయం ఇచ్చేశామని ఆయన సరదాగా అన్నారు. కానీ వాస్తవానికి ప్రపంచ జనాభాలో ఆరోవంతు మన దేశంలోనే ఉన్నా.. మన దేశానికి మాత్రం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత స్థానాన్ని ఇంతవరకు ఇవ్వలేదు.

Advertisement
Advertisement