
27న రానున్న పాక్ బృందం
పఠాన్కోట్ వైమానిక క్షేత్రంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు కోసం పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం
పఠాన్కోట్ దాడి ఘటనపై దర్యాప్తు కోసం...
సుష్మాస్వరాజ్ వెల్లడి; పాక్ ప్రధాని సలహాదారుతో భేటీ
పొఖారా (నేపాల్)/న్యూఢిల్లీ: పఠాన్కోట్ వైమానిక క్షేత్రంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు కోసం పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం ఈనెల 27న భారత్కు రానున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించా రు. గురువారం పొఖారాలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్తో 20 నిమిషాల భేటీ అనంతరం ఆమె ఈ విషయం తెలిపారు. సార్క్ మం త్రుల మండలి సమావేశాల్లో భాగంగా వీరు నేపాల్కు వచ్చారు. ఈనెల 31న అమెరికాలో జరగనున్న అణు భద్రత శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ అవుతారని సుష్మ ఆశాభావం వ్యక్తంచేశారు. పాక్ దర్యాప్తు బృందం భారత్కు వస్తున్న తేదీలు ఖరారైనందున పఠాన్కోట్ దాడి అంశంపై అజీజ్తో జరిగిన భేటీలో చర్చించలేదన్నారు.
పాక్ బృందం ఈనెల 27న భారత్కు వచ్చి 28న దర్యాప్తు చేస్తుందని చెప్పారు. అజీజ్తో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ, షరీఫ్లు అమెరికాలో భేటీ అయ్యే అవకాశముందని, అయితే వీరి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయో, లేదో చెప్పలేమన్నారు. నవంబర్లో పాక్ నిర్వహించనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ రావాలంటూ అజీజ్ ఆహ్వాన పత్రిక అందించారు. కాగా, సార్క్ సెక్రెటరీ జనరల్ పదవికి తమ దేశ దౌత్యవేత్త అమ్జాద్ హుసేన్ సియాల్ పేరును పాక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న అర్జున్ బహదూర్ థాపా (నేపాల్) పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. కాగా.. పఠాన్కోట్ దర్యాప్తునకు సంబంధించి ఏ ప్రాంతాల్లో అవసరమైతే ఆ ప్రాంతాల్లో పాక్ బృందాన్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు ఢిల్లీలో విలేకరులకు చెప్పారు.