తప్పు ఒప్పుకోకుంటే.. న్యాయచర్య | Kerala government warnings to modi government | Sakshi
Sakshi News home page

తప్పు ఒప్పుకోకుంటే.. న్యాయచర్య

Oct 29 2015 3:39 AM | Updated on Aug 21 2018 9:33 PM

గోమాంసం వడ్డించారన్న ఆరోపణలపై ఢిల్లీ కేరళ భవన్‌పై పోలీసులు దాడి వివాదం బుధవారం మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు

మోదీ ప్రభుత్వానికి కేరళ సర్కారు హెచ్చరిక
 
 తిరువనంతపురం/న్యూఢిల్లీ: గోమాంసం వడ్డించారన్న ఆరోపణలపై ఢిల్లీ కేరళ భవన్‌పై  పోలీసులు దాడి  వివాదం బుధవారం మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు చేశారన్న అభియోగాల(107/151సీఆర్‌పీసీ)పై హిందూసేన చీఫ్ విష్ణుగుప్తాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి  కోర్టుకు హాజరుపరచారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పడిన ప్రతిష్టంభన బుధవారమూ కొనసాగింది. కేరళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఢిల్లీ పోలీసులు తాము చట్టం ప్రకారమే వ్యవహరించామని, క్యాంటీన్ తనిఖీ తమ విధుల్లో భాగమని చేస్తున్న వాదనను కేంద్రం సమర్థిస్తే  న్యాయపర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.  

పోలీసులు  రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోకుండా  ప్రవేశించటం చట్టాల ఉల్లంఘనేనని సీఎం ఊమెన్ చాందీ  అన్నారు.  గోమాంసంపై ఢిల్లీలో నిషేధమున్న విషయం తమకు తెలుసని.. దాన్ని వడ్డించనేలేదని, గేదె మాంసాన్నే వడ్డించారని తెలిపారు. కేరళ భవన్‌లో బుధవారం తిరిగి గేదె మాంసాన్ని వండి వడ్డించారు. 45 నిమిషాల్లో ఈ వంటకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోయింది.  రూ.50 చొప్పున 70 ప్లేట్లు అమ్మారు.
 
 పీఎంఓకు నివేదిక!
 ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక ఇవ్వనుంది. దీని కోసం ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక తీసుకుంది. సోమవారం  కేరళభవన్‌లో గోమాంసం వడ్డిస్తున్నట్లు ఫోన్ రావడంతో అక్కడికెళ్లామని పోలీసులు చెప్పారు.  గోమాంసం వడ్డించడం లేదని తెలియడంతో, అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తమను సంప్రదించాలని క్యాంటీన్ సిబ్బందికి తెలిపి.. భవన్‌గేట్, దాని పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామని హోం శాఖకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement