లంచం కేసులో ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలు | Indian-American doctor gets 46 months in jail for bribery | Sakshi
Sakshi News home page

లంచం కేసులో ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలు

Apr 25 2014 10:42 AM | Updated on Jul 6 2019 12:42 PM

అమెరికాలో డయాగ్నస్టిక్ సెంటర్ నడిపిస్తున్న ఓ ఎన్నారై వైద్యుడికి లంచాల కేసులో 46 నెలల జైలుశిక్ష పడింది.

అమెరికాలో డయాగ్నస్టిక్ సెంటర్ నడిపిస్తున్న ఓ ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలుశిక్ష పడింది. న్యూజెర్సీలో ల్యాబ్ నడుపుతున్న డాక్టర్ అశోక్ కుమార్ బబారియా (64) రోగులను తన వద్దకు పంపేందుకు కొంతమంది వైద్యులకు లంచాలు ఇచ్చిన కేసులో ఈ శిక్ష పడింది. అమెరికా జిల్లా జడ్జి క్లైర్ సి సెచి ఎదుట వాదనలు జరగగా, అందులో అశోక్ కుమార్ నేరం నిరూపితమైంది. దీంతో ఆయనకు 46 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు విడుదలైన తర్వాత మరో మూడు నెలల పాటు ఆయన్ను పరిశీలిస్తూ ఉండాలని జడ్జి ఆదేశించారు.

అశోక్ కుమార్ బబారియాకు 25వేల డాలర్ల జరిమానా విధించి, మరో 2 మిలియన్ డాలర్లు జప్తుచేయాల్సిందిగా ఆదేశించారు. లైసెన్సు గల రేడియాలజిస్టు అయిన అశోక్ కుమార్.. న్యూజెర్సీలో ఆరంజ్ కమ్యూనిటీ ఎంఆర్ఐ సెంటర్ నడిపిస్తున్నారు. ఆ సెంటర్కు రోగులను పంపినందుకు గాను వైద్యులకు లంచాలు చెల్లించి, దాదాపు 2 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. ఒక ఎమ్మారై కేసు పంపితే ఒక్కో డాక్టర్కు సుమారు 100 డాలర్ల వరకు లంచం ఇచ్చేవారన్నాయి.అలాగే అల్ట్రా సౌండ్ లేదా డెక్సా స్కాన్ కేసు పంపితే 25 డాలర్లు ఇచ్చేవారట.

Advertisement
 
Advertisement
Advertisement