వైద్యానికి కొత్త మొబైల్ యాప్..! | Sakshi
Sakshi News home page

వైద్యానికి కొత్త మొబైల్ యాప్..!

Published Sat, Oct 10 2015 5:17 PM

How a Mobile App Is Bringing Better Maternal Health Care to Rural Karnataka

కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గర్భిణులు, తల్లీ పిల్లల ఆరోగ్య సేవల్లో సుయోజన యాప్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పేషెంట్ కు ఆరోగ్య  సిబ్బంది అందుబాటులో ఉండేందుకు సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, వివరాలను నమోదు చేసుకొని అత్యవసర సమయంలో తక్షణ వైద్యం అందించేందుకు ఈ సింపుల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు.  మొబైల్ ఆధారిత వైద్య సేవలతో  మారుమూల గ్రామాల్లో తక్షణ వైద్యం అందించగల్గుతున్నారు.

ఇమ్మునైజేషన్ వంటి  వైద్యపరమైన సమస్యలను గుర్తించేందుకు, గర్భిణుల నమోదు, సేవలు అందించడం వంటి వాటిలో ఏఎన్ ఎంలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ సాధారణ మొబైల్ యాప్ తో  వారు సమర్థవంతంగా విధులను నిర్వర్తించేందుకు చక్కగా పనికి వస్తోంది. కర్నాటక ఛామరాజ్ నగర్ కు చెందిన రోహిణి రూరల్ ఏరియాల్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నారు. నిజానికి ఆమె తన విధులను నిర్వహించడంలో ఎంతో చురుకుగానూ, ఆసక్తిగానూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పేషెంట్లకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. క్లిష్టమైన సందర్భాల్లో కీలకమైన కేసుల వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినపుడు..  ఆమె ఓ పద్ధతి ప్రకారం వాటిని గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇటీవల రోహిణి సుయోజన యాప్ వాడకం ప్రారంభించింది. ఈ  మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వాడకం ప్రసూతి, పిల్లల సంరక్షణ చర్యల్లో ప్రస్తుతం ఆమెకు ఎంతో సహకరిస్తోంది.

పరీక్షలు నిర్వహించేందుకు, పరిశోధనలు జరిపేందుకు సుయోజన యాప్ మార్గదర్శకంగా ఉందని రోహణి అంటోంది. ఒక దశలో పనిని వాయిదా వేసే అవకాశం లేనప్పుడు ఎమర్జెన్సీని బట్టి వారికి తక్షణ చికిత్స అందించాల్సి వచ్చినపుడు యాప్ ఎంతో ఉపయోగపడుతోందని రోహిణి చెప్తున్నారు. చిన్న టెక్నాలజీని వాడుకోవడంతో ఎంతోమంది ఏ ఎన్ ఎం లు రోగులకు ప్రత్యేక సేవలు అందించగల్గుతున్నారని కూడ రోహిణి చెప్తోంది. సుయోజన యాప్ ను  వెనుకబడిన వారికి సేవలు అందించేందుకు స్వాస్థి హెల్త్ రిసోర్స్ సెంటర్ ప్రవేశ పెట్టింది. కరుణ ట్రస్ట్ , డి. ట్రీ ఇంటర్నేషనల్ సహకారంతో  సామాజికంగా వెనుకబడ్డి వర్గాలకు ఈ యాప్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

అయితే స్వాస్థి ద్వారా ప్రజారోగ్య సేవలు అందించడం ప్రారంభించి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది. ప్రస్తుతం సేవలను వివిధ కోణాల్లో అట్టడుగు స్థాయినుంచి సమర్థవంగా అందించేందుకు, ఏ ఎన్ ఎం ల కు పని సులభతరం అయ్యేందుకు ఈ మొబైల్ యాప్ ను వాడకంలోకి తెచ్చినట్లు స్వాస్థి డైరెక్టర్ బాబా కార్కల్ చెప్తున్నారు.

పారా మెడికల్ సిబ్బంది తక్షణ వైద్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది.  ఇది లేని సందర్భాల్లో ఏఎన్ ఎం లు అందించాల్సిన కొన్ని క్లిష్టమైన సేవలను కూడ దాట వేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఈ మొబైల్ ఆధారిత వైద్య చికిత్స  ప్రసవానికి ముందు, ప్రసవానంతరం బిడ్డల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కొత్తగా పుట్టిన పిల్లల సంరక్షణకు కావాల్సిన కౌన్సెలింగ్ కు, వారి గుండె కొట్టుకునే తీరు గమనించడంతోపాటు ప్రతి లక్షణాన్ని గుర్తించే అవకాశం ఈ యాప్ తో కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు.

రామరాజనగర్  జిల్లాలో మార్చి 2014 లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఆసక్తికరమైన యాప్ సేవలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలో 31 మంది ఏఎన్ ఎం లు అందిస్తున్నారు.  యూజర్ ఫ్రెండ్లీ గా ఈ యాప్ లో కన్నడలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గురించి ముందుగా దీన్ని వినియోగించే ఏఎన్ ఎం లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి కాగానే సేవలు అందించడంలో వారికి వచ్చే సమస్యలను తీర్చేందుకు ఓ సూపర్ వైజర్ ను కూడ అందుబాటులో ఉంచుతారు.

ప్రస్తుతం ఈ యాప్ ను శిక్షణ తీసుకున్న ఏఎన్ ఎం ల మొబైల్స్ లో మాత్రమే ఇన్ స్టాల్ చేస్తున్నారు. అయితే యాప్ ద్వారా సేవలు అందించడం వల్ల  ఏఎన్ఎం లకు  కొంతవరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ ప్రభుత్వ అంగీకారం కోసం మాత్రం వీరి బృందం పోరాటం చేయాల్సి వస్తోంది. యాప్ కోసం నిధులు సమకూర్చిన నలుగురు సభ్యులున్న  డి-ట్రీ ఇంటర్నేషనల్ తమ ప్రాజెక్టు మరికొన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తోంది.

Advertisement
Advertisement