తలసేమియాతో బాధపడే చిన్నారులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడే దాదాపు 200 మంది చిన్నారులకు ఈ ఏడాది చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా టాటామెడికల్ రీసెర్చ్ సెంటర్(కోల్కతా), సీఎంసీ(వెల్లూర్), రాజీవ్ గాంధీ కేన్సర్ ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్(ఢిల్లీ) కేంద్రాల్లో వీరికి చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఖర్చయ్యే రూ.20 కోట్ల మొత్తాన్ని కోల్ ఇండియా(సీఐఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద అందించనుంది.
తల్లిదండ్రుల జీతం రూ.20 వేల కంటే తక్కువగా ఉన్న చిన్నారులకే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతిఏటా సుమారు 12,000 మంది చిన్నారులు తలసేమియా సమస్యతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స అందించడానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో రోగికి రూ.22–25 లక్షల వరకూ ఖర్చవుతోంది.