గోవాలోని కున్కోలిమ్ గ్రామస్థులు తమకు ఎన్ఐటీ వద్దంటే వద్దని పట్టుబడుతున్నారు.
ఎన్ఐటీనా.. మాకొద్దు: గోవా గ్రామస్థుల నిరసన
Sep 2 2013 3:08 PM | Updated on Sep 1 2017 10:22 PM
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఎన్ఐటీ. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ తమ ప్రాంతంలో వస్తోందంటే ఎవరైనా వద్దంటారా? కానీ, గోవాలోని కున్కోలిమ్ గ్రామస్థులు మాత్రం తమకు ఎన్ఐటీ వద్దంటే వద్దని పట్టుబడుతున్నారు. రాజధాని పనజికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఎన్ఐటీ పెట్టడానికి ప్రతిపాదన రావడంతో ఈ ప్రాంతం వాళ్లు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది పెట్టడం వల్ల అటవీ భూమిని తీవ్రంగా కోల్పోవాల్సి వస్తుందని, అందువల్ల ఇది తమకు వద్దంటే వద్దని నొక్కి చెబుతున్నారు. ఈ విద్యాసంస్థకు ఆరు లక్షల చదరపు మీటర్ల స్థలం కేటాయించారని, దాదాపు ఈ ప్రాంతమంతా అడవులతో నిండి ఉండటమే కాక, అపార జీవవైవిధ్యంతో కూడి ఉంటుందని వాళ్లు వాదిస్తున్నారు. దీన్ని కోల్పోవడం ఏమాత్రం సమంజసం కాదని ఎన్ఐటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ సభ్యుడు ఆస్కార్ మార్టిన్స్ తెలిపారు.
భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గోవాలో ఎన్ఐటీ ఏర్పాటు చేయాలని గత సంవత్సరం తలపెట్టింది. ఉన్నత విద్య కోసం గోవా విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సంస్థ కోసం మొత్తం 12 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించగా, అందులో దాదాపు సగం అటవీ భూమే. కొంత భాగం వ్యవసాయ భూములు కూడా ఉండటంతో స్థానికులు ఎన్ఐటీ ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నారు.
Advertisement
Advertisement