
వాద్రానూ వదలకూడదు!
సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వెల్లువెత్తిన రియల్టీ, భూ కుంభకోణాల ఆరోపణలను ఇప్పటిదాకా ఖండిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూ దందాల ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడి ఉంటే వాద్రానైనా సరే వదలకూడదంటూ సొంత పార్టీ ఎంపీ రావ్ ఇంద్రజిత్ సింగ్ (గుర్గావ్) సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై వెల్లువెత్తిన రియల్టీ, భూ కుంభకోణాల ఆరోపణలను ఇప్పటిదాకా ఖండిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూ దందాల ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడి ఉంటే వాద్రానైనా సరే వదలకూడదంటూ సొంత పార్టీ ఎంపీ రావ్ ఇంద్రజిత్ సింగ్ (గుర్గావ్) సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గుర్గావ్లో వ్యవసాయ భూములను వాణిజ్య, నివాస భూములుగా మార్చేస్తూ విచ్చలవిడిగా జారీ చేసిన అనుమతులపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేయాల్సిన తీరులో పని చేయలేదని కుండబద్దలు కొట్టిన ఎంపీ, ‘‘వాద్రాపై న్యాయ విచారణ జరపాలని కోరడం నా పని కాదు. నా సొంత లోక్సభ నియోజకవర్గంలో భూ దందా ద్వారా ఎవరైనా అక్రమంగా సంపాదిస్తున్నారా? అన్నది చూడటమే నా పని. అలా ఎవరైనా చేసి ఉంటే వారిని వదలకూడదు. అది వాద్రా అయినా సరే, తను చేసిన పనికి బాధ్యత వహించాల్సిందే’’ అని కూడా స్పష్టం చేశారు. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తో వాద్రా భూ ఒప్పందాలను తప్పుబడుతూ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బయట పెట్టిన వివరాలపై విలేకరుల ప్రశ్నలపై ఎంపీ ఈ విధంగా బదులిచ్చారు. అయితే విచారణంటూ జరిగితే అది కేవలం వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందాలకే పరిమితం కారాదని, అనుమానాస్పద భూ లావాదేవీలన్నింటిపైనా విచారణ జరపాలని సింగ్ కోరారు. ‘‘భూ వాడకంలో మార్పుచేర్పులు, కుంభకోణాలు, అక్రమంగా భారీ సంపదను మూటగట్టుకోవడం వంటి ఆరోపణలు ఏవి వచ్చినా కేవలం సోనియాగాంధీ అల్లుడిపై మాత్రమే కాకుండా అందరి పాత్రపైనా విచారణ జరగాలి.
గత ఐదారేళ్లలో గుర్గావ్లోని 21 వేల ఎకరాలను చాలావరకు వ్యవసాయ భూమి నుంచి సెజ్లుగా బదలాయించారు. ఈ ఒప్పందాల వెనక ఉన్న వాస్తవాలన్నీ బయటికి రావాలని నేను కోరుతున్నాను. 2004 నుంచీ ఇలా కేటాయించిన 1,200 ఎకరాలనూ విచారణ పరిధిలోకి తేవాలి’’ అని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన కాంగ్రెస్, వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. సింగ్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చారని, మీడియాలో వస్తున్నట్టుగా తానేమీ మాట్లాడలేదని చెప్పారని ఏఐసీసీ ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. వాద్రా-డీఎల్ఎఫ్ ఒప్పందంలో అక్రమాలేమీ లేదని, అయినా దానిపై నిర్ణయాన్ని హర్యానా ప్రభుత్వానికే వదిలేశామని చెప్పుకొచ్చారు.
వాద్రాపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
లక్నో: రాబర్ట్ వాద్రాపై వచ్చిన భూ దందా ఆరోపణలపై విచారణ జరపాలంటూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు వాద్రాపై చేసిన చేసిన ఆరోపణలపై విచారణ జరిపిం చాలని సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ అందులో కోరారు. వాద్రా, హర్యానా ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొ కొ జరిగిన వైనం స్పష్టంగా కన్పిస్తోందని ఆమె ఆరోపించారు.