సాయం చేస్తే.. బొగ్గుపై ఆధారపడం! | At Paris Climate Talks, Time to Whittle Down the Options | Sakshi
Sakshi News home page

సాయం చేస్తే.. బొగ్గుపై ఆధారపడం!

Dec 4 2015 3:20 AM | Updated on Sep 3 2017 1:26 PM

అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయం, అవసరమైన సాంకేతికత అందిస్తే విద్యుదుత్పత్తిలో బొగ్గుపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమేనని పారిస్‌లో...

లె బౌజెట్: అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయం, అవసరమైన సాంకేతికత అందిస్తే విద్యుదుత్పత్తిలో బొగ్గుపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమేనని పారిస్‌లో జరుగుతున్న వాతావరణసదస్సులో భారత్ స్పష్టం చేసింది. పునరుత్పాదిత విద్యుదుత్పత్తి ఖర్చు ను తగ్గించుకునేందుకు ధనిక దేశాల ఆర్థిక, సాంకేతిక సహకారం అవసరమని పేర్కొంది. దేశ విద్యుత్ అవసరాల కోసం శిలాజ ఇంధనాన్ని భారీగా వినియోగించే విషయంలో భారత్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలు సాగుతున్న సమయంలో.. భారత్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాధుర్ గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

కాగా, సదస్సులో ఒక ముసాయిదా ఒప్పందాన్ని ఆవిష్కరించారు. అయితే, దానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అందులోని దాదాపు 250 అంశాలపై భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ‘విద్యుదుత్పత్తిలో సౌరశక్తి, పవన శక్తి మా తొలి రెండు ప్రాథమ్యాలు. ఆ తరువాత జలవిద్యుత్, అణు విద్యుత్‌లకు ప్రాధాన్యతనిస్తాం.

ఇవి పోనూ మిగతా విద్యుత్ అవసరాల కోసం బొగ్గుపై ఆధారపడతాం’ అని భారత్ విధానాన్ని మాధుర్ వివరించారు.  సౌర, పవన విద్యుత్ అందుబాటులో లేనప్పుడు.. తక్షణమే బొగ్గు ఆధారిత విద్యుతుత్పత్తికి మారేందుకు అవసరమైన సాంకేతికత తమ తక్షణావసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై పోరాటంలో భారత్ సమస్య కాబోదని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement