'సంచలన పార్టీ'కి డిపాజిట్ గల్లంతు | AAP by-poll candidates in Punjab lose deposit | Sakshi
Sakshi News home page

'సంచలన పార్టీ'కి డిపాజిట్ గల్లంతు

Aug 26 2014 12:15 PM | Updated on Apr 4 2018 7:42 PM

'సంచలన పార్టీ'కి డిపాజిట్ గల్లంతు - Sakshi

'సంచలన పార్టీ'కి డిపాజిట్ గల్లంతు

రాజకీయాల్లో వారం రోజులు సుదీర్ఘ గడువు అన్నాడు... ఈ మాటలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు అక్షరాలా వర్తిస్తాయి.

రాజకీయాల్లో వారం రోజులు సుదీర్ఘ గడువు అన్నాడు... ఈ మాటలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు అక్షరాలా వర్తిస్తాయి. అవినీతిపై పోరాటాన్ని అస్త్రంగా చేసుకుని అనతికాలంలో ఢిల్లీలో గద్దెనెక్కిన ఆప్ అంతలోనే ఆదరణ కోల్పోయింది. ఆప్ స్పీడు చూసి అతిపెద్ద పార్టీలు సైతం జడుసుకున్నాయి. అయితే ఆప్ రాజకీయ ప్రభంజనం పాలపొంగులా చల్లారిపోవడంతో ఇప్పుడు పెద్ద పార్టీలు లోలోన సంతోషపడుతున్నాయి. అతితక్కువ కాలంలో జనాదరణ పొంది సంచలన విజయం సాధించిన ఆప్ స్వీయతప్పిదాలతో అంతేవేగంగా కిందకు పడింది. పంజాబ్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు తాజా రుజువు.

సాధారణ ఎన్నికల్లో దేశమంతా ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించినా పంజాబ్ అక్కున చేర్చుకుంది. నలుగురు ఎంపీలును గెలిపించింది. మూడు నెలలు తిరగకుండానే పరిస్థితి తారుమారైంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కలేదు. పాటియాలా, తల్వాండి సాబూ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపపోరులో ఆప్ అభ్యర్థులు పూర్తిగా వెనుకబడ్డారు. పాటియాలా సీటును కాంగ్రెస్, తల్వాండి సాబూ స్థానాన్ని శిరోమణి అకాలీదళ్ గెల్చుకున్నాయి.

అయితే ఈ ఫలితంతో తాము నిరాశ చెందలేదని ఆప్ ఆద్మీ పార్టీలు చెప్పడం గమనార్హం. ప్రజలకు క్లీన్ పాలిటిక్స్ అందించాలన్న లక్ష్యానికి కట్టుబడ్డామని పునరుద్ఘాటించింది. డబ్బు, మద్యంతో ఓటర్లను కాంగ్రెస్, అకాలీదళ్ మభ్యపెట్టవడం వల్లే గెలిచాయని ఆప్ నేతలు ఆరోపించారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్ కు ఇప్పుడు పంజాబ్ లోనూ ఎదురుదెబ్బ తగిలింది. దీని బట్టి చూస్తే తమకు పట్టం కట్టిన చోట పడిపోవడం ఆప్ కు అలవాటుగా మారిందన్న అనుమానం కలగకమానదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement