సదారాంను తొలగించాలి | Ysrcp telangana committee requests to eliminate the Raja sadaram | Sakshi
Sakshi News home page

సదారాంను తొలగించాలి

May 28 2015 12:56 AM | Updated on May 29 2018 3:30 PM

సదారాంను తొలగించాలి - Sakshi

సదారాంను తొలగించాలి

అధికార పార్టీకి అనుకూలంగా, పక్షపాత వైఖరితో పనిచేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..

సీఈవోకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ వినతి  
 సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి అనుకూలంగా, పక్షపాత వైఖరితో పనిచేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేసింది. సదారాం స్థానంలో మరో అధికారిని నియమించి ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, హెచ్‌ఏ రెహమాన్ వినతిపత్రాన్ని సమర్పించారు.
 
 అభ్యంతరాలుంటే తెలపండి: భన్వర్‌లాల్
 ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇద్దరు పరిశీలకులను నియమించామని, అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రూపొందించిన ఎమ్మెల్యేల ఓటర్ల జాబితాలో ఏయే పార్టీలకు వారు ప్రాతి నిధ్యం వహిస్తున్నారనే వివరాలు లేకుండానే సదారాం ప్రచురించారని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నామినేషన్ల ముగింపునకు ముందు జాబితాలో పార్టీల పేర్లను పొందుపరిచారని వారు సీఈవోకి తెలిపారు.
 
 ఇది కావాలనే చేశారని, పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈ జాబితా ద్వారా అర్హులైన ఓట ర్లుగా చేసే ప్రయత్నం జరిగిందని వారు వివరించా రు. అనంతరం కె.శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్య తీసుకోవాలని తాము కోర్టునూ ఆశ్రయించామన్నారు. వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించవద్దని కోరామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement