ఇంటర్‌ విద్యార్థుల కోసం యూట్యూబ్‌ చానెల్‌ | Youtube Channel For Intermediate Students In Telangana | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థుల కోసం యూట్యూబ్‌ చానెల్‌

Feb 19 2020 2:58 AM | Updated on Feb 19 2020 2:58 AM

Youtube Channel For Intermediate Students In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థుల కోసం యూట్యూబ్‌ చానెల్‌ ను ఇంటర్మీడియట్‌ బోర్డు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పేరుతో ఇప్పటికే రూపొందించిన ఈ చానెల్‌లో వీడియో పాఠాలు పొందుపరుస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల పాఠాలు అందులో పొందుపరిచినట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని పాఠాలను, ప్రథమ సంవత్సర పాఠాలను ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నామని త్వరలోనే వాటిని అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. టీశాట్, ఇతర వెబ్‌సైట్లకు సంబంధించిన పాఠాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టుల పాఠాలను రూపొందించాక వాటిని నిఫుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపి అప్రూవల్‌ తీసుకుంటామన్నారు.  ఆయా వీడియో పాఠాలను విద్యార్థులకు వచ్చే జూన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులు వాటిని ప్రారంభం నుంచే వీక్షించేలా చర్యలు చేపడతామని తెలిపారు. సైన్స్‌ ప్రాక్టికల్స్‌ ఎలా చేయాలన్న దానిపైనా పాఠాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాఠాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా చూసుకునేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు జేఈఈ, నీట్‌కు సంబంధించిన పాఠాలను కూడా రూపొందించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇంటర్‌ పరీక్షల్లో ఏఐ 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఈసారి ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అమలు చేస్తున్నట్లు జలీల్‌ వెల్లడించారు. ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) బార్‌ కోడ్‌తో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నైజేషన్‌ను (ఓసీఆర్‌) ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఓఎంఆర్‌లో బార్‌ కోడ్‌ విధానం ఉండనుం డగా, ఓసీఆర్‌లో విద్యార్థుల ఫొటోలు స్కాన్‌ చేస్తారని, ఆర్టి ఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకా రంతో పరీక్షలకు వచ్చింది ఆ విద్యార్థు లేనా? ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు వచ్చారా? అన్నది సులభంగా గుర్తించే వీలుంటుందని వెల్లడించారు. ఓఎంఆర్‌ బబ్లింగ్‌ను మాత్రమే చూడనుంది. ఓసీఆర్‌ మాత్రం పదాల్లో రాసిన వివరాలను, నంబర్లను, బబ్లింగ్‌ నంబ ర్లను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. దాంతో జవాబులకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్‌లో ఏమైనా తేడా లొస్తే వాటిని సులభంగా గుర్తించొచ్చని వివరించారు. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో 90% మార్కులు వచ్చి, మరొక సబ్జెక్టులో 9 మార్కు లే వస్తే ఆ అబ్‌నార్మల్‌ డిఫరెన్స్‌ను ఏఐతో గుర్తించొచ్చని వివరించారు. మార్చి 4 నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,339 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement