సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్లో అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది.
బడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించింది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీలకు నెలకు రూ. 2000 స్కాలర్ షిష్లు ఇవ్వాలని నిర్ణయించింది.



