సుబ్బులక్ష్మి గతాన్ని.. సంగీతాన్నీ ప్రేమిద్దాం..!
‘మనకు తెలియని ఎం.ఎస్’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు
సాక్షి, హైదరాబాద్: భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం గురించి ప్రపంచానికి తెలియని నూతన ఆవిష్కరణ ప్రముఖ పాత్రికేయుడు టీజేఎస్ జార్జి ఇంగ్లిష్లో రాసిన పుస్తకాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ‘మనకు తెలియని ఎం.ఎస్ ’పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఓల్గా, కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణ ఆవిష్కరించారు. ‘మంథన్’నిరంతర మేధోమథన కార్యక్రమాల్లో భాగంగా సంగీత ప్రియులు, సామాజిక కార్యకర్తల మధ్య దేవదాసి పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు ఎదిగి వచ్చిన ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవన గమనంలోని విషాదానికి కారణమైన సామాజిక అంతరాలను, అణచివేతను ఈ సభలో వక్తలు లోతుగా విశ్లేషించారు.
అవలక్షణాలను వదిలించుకోవాలి...
ఎంఎస్ సుబ్బులక్ష్మి దేవదాసి అని తెలిసిన తరువాత కూడా ఆమె దేహాన్ని సంగీతం నుంచి విడదీయకుండా, దేవదాసీగా ఆమెను, ఆమె సంగీతాన్ని కలిపి ప్రేమించగలిగే సమాజం రావాలని కర్ణాటక గాయకుడు, మేధావి టి.ఎం.కృష్ణ అన్నారు. ‘సంస్కృతి–సమాజం’అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ కొంద రి అస్తిత్వాన్ని అందరి అస్తిత్వంగా చేసి సంస్కృతిగా చెబుతున్నారని, ఆ సంస్కృతిలోని భిన్నసామాజిక అవలక్షణాలను వదిలించుకోవాలన్నారు. ఓల్గా మాట్లాడుతూ ఈ పుస్తకానికి ముందు ఎం. ఎస్ సంగీతానికి నమస్కరించానని, అయితే, తన స్వగ్రామమైన మధురై నుంచి మద్రాసుకు తన గమ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమె నిర్ణయాధికార శక్తికి యిప్పుడు నమస్కరిస్తున్నానన్నారు.
రచయిత ఆర్.ఎం.ఉమా మహేశ్వర్రావు మాట్లాడుతూ సంస్కరణ, సంస్కారం, ఉన్నతం పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కళల నుంచి వెలివేసిన వైనాన్ని విప్పి చెప్పా రు. కళలను అగ్రకుల, ఆధిపత్య వర్గాలకే పరిమితం చేసే ఈ కుట్రే ఎం.ఎస్ ను తన ఇంటినీ, తన ఊరును వదిలి మద్రాసుకి వెళ్ళిపోయేలా చేసిందన్నారు. ఎం.ఎస్ జీవితాన్ని ‘మనకు తెలి యని ఎం.ఎస్’పుస్తక ప్రచురణ ద్వారా తెలుగు వారికి అందిం చిన గీతారామస్వామికి వక్తలు అభినందనలు తెలిపారు.