కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వరంగల్ లోక్సభ సభ్యుడు కడియం శ్రీహరి మండిపడ్డారు.
- ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు..
- ఇలాగే కొనసాగితే తెలంగాణకు అన్యాయం
- వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి
హన్మకొండ సిటీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వరంగల్ లోక్సభ సభ్యుడు కడియం శ్రీహరి మండిపడ్డారు. హైదరాబాద్పై గవర్నర్కు విశేష అధికారాలు కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని పేర్కొన్నారు. హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, శంకర్నాయక్తో కలి సి మాట్లాడారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకుంటూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రప్రభుత్వ వైఖరితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలి పారు. ఇక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర వైఖరిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కడియం స్పష్టం చేశారు.
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి
ఎన్నో పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు నమ్మి టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని కడియం శ్రీహరి తెలిపారు. ఇది గిట్టని వారు లేని పోని ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్పై గవర్నర్కు విశేష అధికారాలు కట్టబెట్టిన విషయమై.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కృషి చేయాలని, లేనిపక్షంలో రాజకీయంగా దెబ్బ తింటారనే విషయాన్ని ఇక్కడి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని కడియం హితవు పలికారు. ఆర్డినెన్స్ ద్వారా పోలవరం పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ఈ నిర్ణయంతో తెలంగాణకు చెందాల్సిన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీలోకి వెళ్లి ఇక్కడ విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు కళింగపట్నంలోని హిందూజా ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 55 శాతం విద్యుత్ను నిలిపివేశారని పేర్కొన్నారు. ఇలా అనేక అంశాల్లో తెలంగాణను ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పాలనా సౌల భ్యం కోసం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచారే తప్ప ఆంధ్రప్రదేశ్కు హక్కులు కల్పించలేదని తెలిపారు. దీన్ని గుర్తించకుండా హైదరాబాద్లో చదివే ఏపీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి అంశాల ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలనేది కేంద్రం భావనగా కనిపిస్తోందని ఆయన అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సహోదర్రెడ్డి, గుడిమల్ల రవికుమార్, గైనేని రాజన్, ఇండ్ల నాగేశ్వర్రావు, నయీమొద్దీన్, రమేష్, వీరేందర్, పీఆర్రెడ్డి పాల్గొన్నారు.


