‘రుణ’మెప్పుడో..!

Un Employed Waiting For Self Employment Scheme Corporation Loans - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందజేసే రుణాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. రుణాల మంజూరుకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో రుణాల పంపిణీ ప్రారంభమైనట్లే అయి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో కార్పొరేషన్‌ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్‌ అడ్డుగా మారడంతో చెక్కులు అందుబాటులో ఉన్నా పంపిణీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలు అందించేందుకు ఎన్నికల కమి షన్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. బీసీ కార్పొరేషన్‌లో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమా రు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో వివిధ రుణాల కోసం సుమారు 6,300 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

అందని ద్రాక్షే.. 
బీసీ కార్పొరేషన్‌ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికే రూ.లక్షలోపు రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదట ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది.

చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏప్రిల్‌ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులు స్వీకరించారు. 2011 జనాభా లెక్కాల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్‌ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు గుర్తించారు. కాగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సుమారు 6,300 మంది లబ్ధిదారులు వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా గతంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఏ ఒక్కరికీ మంజూరు ఇవ్వలేదు. కోడ్‌ ఎత్తి వేసి వారం రోజులు గడుస్తున్నా లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఎలాంటి ప్రకటనలో రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

750 మందికి పంపిణీ
జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 15,800 లబ్ధిదా రులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మందిని లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేట గిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి– 3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధి దారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేలు వంద శాతం సబ్సిడీపై చె క్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రూ.50 వేల యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మరో 1400 మందికి చెక్కుల పంపిణీ సిద్ధం చేసినా కోడ్‌ అమలులోకి రావడంతో పంపిణీకి బ్రేక్‌ పడింది. దీంతో సబ్సిడీ రుణా ల పంపిణీ నిలిచిపోయింది. రుణాల పంపిణీని ప్రారంభించకపోతే మళ్లీ జనవరిలో సర్పంచ్‌ల ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చి రుణాలు నిలిచిపోయే అవకాశం ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.  

ఎస్సీ కార్పొరేషన్‌లో  6,566 మంది దరఖాస్తులు 
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచి ఎస్సీ కార్పొరేషన్‌లో వివిధ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దరఖాస్తుల స్వీకరణ గడువును మూడు సార్లు పెంచారు. ఇప్పటి వరకు ఆయా రుణాల కోసం ఆన్‌లైన్‌లో 6,566 దరఖాస్తులు వచ్చిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఐటీడీఏ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ గిరిజనులకు అందజేసే రుణాలకు సంబంధించి కనీసం దరఖాస్తులను కూడా స్వీకరించలేదు. స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏప్రిల్‌లో ప్రణాళిక విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతో అక్టోబర్‌లో విడుదల కావడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

జనవరిలో సర్పంచ్‌ల ఎన్నికల కోడ్‌ !
ఆయా కార్పొరేషన్లలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రుణాల పంపిణీలో జాప్యం జరిగితే జనవరిలో సర్పంచ్‌ల ఎన్నికలు జరగనున్నందున కోడ్‌ అమలులోకి వస్తే మళ్లీ రుణాల పంపిణీకి బ్రేక్‌ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆలోపు అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాల పంపిణీ ప్రారంభిస్తే బాగుంటుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈలోగా రుణాల పంపిణీ జరగకపోతే లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పేలా లేవని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top