‘వజ్రాలను’ అమ్మేద్దాం!

TSRTC Decided To Stop Vajra Bus Services in Telangana - Sakshi

నష్టాలు భరించలేక వజ్ర బస్సులను వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వజ్ర బస్సులు చేదు అనుభవాన్నే మిగిల్చడంతో వాటిని వదిలించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు రావటంతో, వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని ఆయన ఆదేశించారు. కానీ అవి అందుకు యోగ్యం కాదని తేలడంతో వాటిని అమ్మకానికి పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఏసీ వసతితో ఉన్నందున సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రైవేట్‌ సంస్థలు వీటిని కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్కో బస్సుకు దాదాపు రూ.10 లక్షల వరకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని సమాచారం.

60 బస్సులు సిద్ధం.. 
ప్రస్తుతం ఆర్టీసీ వద్ద వంద వజ్ర బస్సులున్నాయి. 2017లో 40 బస్సులతో వీటిని ప్రారంభించారు. ప్రయాణికుల వద్దకే బస్సులు వచ్చేలా సీఎం కేసీఆర్‌ ఈ విధానానికి రూపకల్పన చేశారు. కానీ ఆ విధానం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఫలితంగా రూ.12 కోట్ల మేర నష్టాలు వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. అప్పట్లో ఒక్కోటి రూ.25 లక్షలు వెచ్చించి ఈ బస్సులను కొనుగోలు చేశారు. వీటిని కార్గోకు వినియోగించాలని తొలుత సీఎం ఆదేశించారు.

కానీ ఏసీతో ఉన్న ఈ బస్సులను సరుకు రవాణాకు వాడితే నష్టమ ని అధికారులు తేల్చారు. పైగా అవి మినీ బస్సులు కావడంతో చిన్న చక్రాలతో ఉం టాయి. అందువల్ల సరుకు రవాణాకు అనుకూలం కాదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటిని అమ్మితేనే లాభం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఉన్నవాటిలో 60 బస్సులు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు వీటిని అమ్మకానికి పెట్టబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన విక్రయ నోటిఫికేషన్‌ వెలువడనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top