జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామని, గత వారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కూడా మళ్లీ నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుందని చెప్పారు.
మధ్యాహ్నం 12 గంటలవరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం తర్వాత కోఆప్షన్ సభ్యు ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. అనంతరం 3 గంట లకు మళ్లీ మొదలయ్యే సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక లు జరుగుతాయని వివరించారు.
కోరం తప్పనిసరి!
జిల్లా పరిషత్ సమావేశం జరగాలంటే కోరం తప్పని సరి. 17 మంది సభ్యులు హాజరైతే నే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిర్ధేశిత సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికలు వాయిదా పడతాయి. ఆ తర్వాత 3 గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడుతుంది. మరుసటి రోజుకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ క్రితం రోజు పరిస్థితే పునరావృతమైతే మాత్రం ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ నిర్ణయం మేరకు తదుపరి తేదీని ప్రకటిస్తారు. కోరం ఉండి కో ఆప్షన్ సభ్యు ల ఎన్నిక జరిగిన అనంతరం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కోరం లేకు న్నా.. ఎన్నిక వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు.