Sakshi News home page

దసరా నుంచి కొత్త రేషన్‌కార్డులు

Published Fri, Aug 22 2014 3:13 AM

The new ration cards from Dasara

- రుణమాఫీ చేసితీరుతాం
- మంత్రి కేటీఆర్ వెల్లడి

ముస్తాబాద్: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ఇంటింటి సర్వే చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అర్హులకు దసరా నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని వెల్లడించారు. ముస్తాబాద్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సర్వేకు ముందే ప్రభుత్వానికి 6.15 లక్షల రేషన్‌కార్డులను సరెండర్ చేశారని తెలిపారు. హైదరాబాద్ భూములు విక్రయించైనా రుణమాఫీఅమలు చేస్తామని, తలతాకట్టు పెట్టయినా రైతులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు.

రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గోదాముల నిర్మిస్తున్నామని, ఇందుకోసం 200 గ్రామాలను ఎంపిక చేశామని వివరించారు. గోదాముల వద్ద ప్లాట్‌ఫామ్‌లూ నిర్మిస్తామని తెలిపారు.   ఉపాధిహామీ పనుల్లో వెనుకబడిన కరీంనగర్ జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేలా కూలీలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేడీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు, ఆర్డీవో బిక్షానాయక్, ఓఎస్డీ శ్రీనివాస్, డ్వామా పీడీ గణేశ్, జెడ్పీటీసీ శరత్‌రావు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్‌పాషా పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement