నేటి నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం
విదేశీ చెల్లింపులపై తక్కువ టీసీఎస్
డేటా సెంటర్ సేవలకు 20 ఏళ్లు పన్ను రహితం
వాహన విలువ రూ.5 లక్షలు దాటితే పాన్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు నిబంధనల భారం తగ్గనుంది. ఇందుకు వీలు కల్పిం చే కొత్త ఆదాయపన్ను చట్టం– 2025 నేటి నుంచి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తోంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని సులభతరంగా తీర్చిదిద్దినట్టు కేంద్రం చెబుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెరగనుంది. విదేశీ పర్యటనలు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపే నిధులపై మూలం వద్దే పన్ను కోత (టీసీఎస్) తగ్గనుంది. అలాగే, భారత్ నుంచి డేటా సెంటర్ సేవలను పొందే విదేశీ కంపెనీలపై 20 ఏళ్ల వరకు పన్ను భారం ఉండదు.
⇒ కొత్త చట్టానికి మారే క్రమంలో.. ఈ–ఫైలింగ్ పోర్టల్ పాత, కొత్త పన్ను చట్టాల్లోని నిబంధనల అమలుకు వీలు కల్పించనుంది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయి.
⇒ అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుంది.
⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపులు జూన్ నుంచి ప్రారంభం కానుండగా, అవి కొత్త చట్టం కిందే అమలు కానున్నాయి.
⇒ గతంలో అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనేవి ఉండేవి. ఇకపై ‘పన్ను సంవత్సరం’ అమల్లోకి రానుంది.
⇒ ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసినప్పటికీ టీడీఎస్ రిఫండ్ కోరవచ్చు.
⇒ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి పెరగనుంది. ఆప్షన్ల ప్రీమియంపై ఎస్టీటీ 0.1 శాతం నుంచి 0.15 శాతానికి, ఆప్షన్ల ఎక్సర్సైజ్పై 0.125 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది. తద్వారా ఎఫ్అండ్వోలో స్పెక్యులేషన్ తగ్గుతుందన్నది ప్రభుత్వం అంచనా. చిన్న ఇన్వెస్టర్లు నష్టపోకుండా చూడొచ్చని కేంద్రం భావిస్తోంది.
⇒ విదేశీ పర్యాటక ప్యాకేజీల కోసం చేసే చెల్లింపులపై 20 శాతంగా ఉన్న టీసీఎస్ 18 శాతానికి తగ్గనుంది.
⇒ విదేశాల్లో వైద్యం, విద్య కోసం చేసే నగదు తరలింపులపై 5 శాతం స్థానంలో 2 శాతం టీసీఎస్ చెల్లిస్తే చాలు.
⇒ 20 ఏళ్ల పన్ను రహిత ప్రయోజనంతో డేటా సెంటర్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. భారత డేటా సెంటర్ల నుంచి సేవలు పొందే విదేశీ కంపెనీలు ఇకపై పన్ను చెల్లించక్కర్లేదు. ఇది పరోక్షంగా భారత డేటా సెంటర్ కంపెనీలకు మేలు చేయనుంది. సొంతంగా భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకూ ఈ ప్రయోజనం దక్కనుంది.
⇒ ఐటీ సేవలకు సంబంధించి ‘సేఫ్ హార్బర్’ విధానం కింద అర్హత పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచారు. ఐటీ, ఐటీఈఎస్, కేపీవో, కాంట్రాక్ట్ ఆర్అండ్డీ సేవలన్నీ ఐటీ సేవల కిందే పరిగణించనున్నారు.
⇒ బ్యాంకుల్లో రూ.50 వేలు మించిన జమలపై కాకుండా.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలు మించినప్పుడు పాన్ ఇస్తే సరిపోతుంది.
⇒ ఇల్లు లేదా భూమి కొనుగోలు, విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే ఇకపై పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు.
⇒ ఇకపై ఏ వాహన కొనుగోలు అయినా విలువ రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సిందే.
⇒ హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు లక్ష రూపాయలు మించితే ఇకపై పాన్ తప్పనిసరి.
⇒ జీవిత బీమా పాలసీ కొనుగోలుకు పాన్ ఇవ్వడం తప్పనిసరి.


