తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ

Published Wed, Jul 12 2017 12:04 AM

తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకా రుడు రవిశంకర్‌ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది. సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.

Advertisement
Advertisement