తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం 9 గంటల నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం 9 గంటల నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తాము స్పీకర్ మధుసూదనాచారిని కోరామని టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, పార్టీ మారిన నేతలపై అనర్హత వేటుతో పాటు.. గవర్నర్ ప్రసంగం సమయం నాటి అసెంబ్లీ ఫుటేజి ఇవ్వాలని తాము స్పీకర్ను కోరినట్లు చెప్పారు.
సీట్ల కేటాయింపుపై బుధవారం నాడు స్పష్టత ఇస్తామని స్పీకర్ తెలిపారని, అయితే ఫుటేజి మాత్రం ఇచ్చేది లేదన్నారని ఆయన వివరించారు. అనర్హత విషయం తేల్చేందుకు సమయం పడుతుందని స్పీకర్ సమాధానం ఇచ్చినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ రెండు అంశాలపైనా కూడా స్పష్టత ఇచ్చేంతవరకు తాము స్పీకర్ కార్యాలయంలోనే బైఠాయిస్తామన్నారు.