
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇలా..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23కు పెరగనున్న సీట్లు
అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే..
శాసనసభలో ఏకంగా 50 మంది మహిళల ప్రాతినిధ్యం
119 నుంచి 153కు పెరగనున్న మొత్తం నియోజకవర్గాలు
మారనున్న పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు.. కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (డీలిమిటేషన్) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది.
తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్–డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
సగటు జనాభా ప్రామాణికంగా...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు.
తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు
2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.
పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్సిటీ (హైదరాబాద్ జిల్లా)లో రెండు, గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.
ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితి
డీలిమిటేషన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.
డీలిమిటేషన్ ఇలా..
– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.
– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.
– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయాయి.
– డీలిమిటేషన్లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే.