రేపటి నుంచి సచివాలయానికి తాళం!
సాక్షి, హైదరాబాద్: సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాన్ని పునర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 90 శాతానికి పైగా ప్రభుత్వ శాఖలు తమ ఫైళ్లను తరలించడంతో చాలా బ్లాకులు ఖాళీ అయ్యాయి. సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది శుక్రవారం బృందాలుగా ఏర్పడి పాత సచివాలయంలోని బ్లాకులను పరిశీలించారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేసేందుకు జీఏడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో తాళం చెవులు ఉంటాయని, అవసరమైన శాఖలు అక్కడి నుంచే తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.