ముగిసిన కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ల సందర్శన | telangana cm kcr reaches Hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ల సందర్శన

Dec 8 2017 8:29 PM | Updated on Oct 30 2018 7:50 PM

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తర తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన ముగిసింది. మూడు రోజులపాటు ఐదు జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇద్దరు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రెండు హెలికాప్టర్లలో పర్యటించి నాలుగు బ్యారేజీలు, ఏడు పంప్ హౌజ్ లు, రెండు అండర్ టన్నెల్, సర్జిపూల్, సబ్ స్టేషన్ పనులు పరిశీలించారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి శనివారం ప్రాజెక్టు పనుల పురోగతిపై హైదరాబాద్ని ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

కాగా ముఖ్యమత్రి తొలిరోజు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు బ్యారేజీలు, పంప్ హౌజ్ పనులు పరిశీలించారు. రెండో రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసిలో తెలంగాణ విద్యుత్ కేంద్రం తొలిదశ 1600 మెగావాట్ల రెండు ప్లాంట్ల పనులను పర్యవేక్షించారు. అక్కడి నుంచి నేరుగా ధర్మారం మండలం నంది మేడారానికి చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో 6వ ప్యాకేజి పంప్ హౌజ్,  టన్నెల్ పనులు పరిశీలించారు. మేడిగడ్డ నుంచి వరదకాలువ ద్వారా నీటిని తరలించేందుకు ఏడు పంపులకు గాను వచ్చే జూన్ వరకు రెండు పంపులు, డిసెంబర్ నాటికి మిగతావి  సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement