ఈసారీ అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌!

Special Advanced Hooks Use For Ganesh Nimajjanam Hyderabad - Sakshi

గణేష్‌ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తయారీ

గత ఏడాది వీటి వినియోగంతో సత్ఫలితాలు

తొమ్మిది చోట్ల 138 క్రేన్లకు వీటి ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గణేష్‌ మండపాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకు క్రేన్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది  ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్‌) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లోని 138 క్రేన్లకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వీటి పనితీరును పరీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్‌ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్‌ రూపొందించిన ఈ క్విక్‌ రిలీజ్‌ డివైజ్‌ (క్యూఆర్డీ) హుక్స్‌ ఈసారి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఉండే 40 క్రేన్లకు వాడుతున్నారు. వీటి వినియోగంపై మురళీధర్‌ గురు–శుక్రవారాల్లో క్రేన్‌ ఆపరేట్లకు శిక్షణ ఇచ్చారు.

తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్‌ను గతేడాది వినియోగించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్‌ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్‌ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్‌ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్‌... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్‌ అవుతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్ళిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్‌ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్‌ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్‌ వినియోగించిన క్రేన్‌ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత రీసెర్చ్‌ చేసిన మురళీధర్‌ అడ్వాన్డ్స్‌ వెర్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్‌ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీన్ని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్‌ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్‌ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. ఇలాంటివి హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 40 క్రేన్లకు ఏర్పాటు చేశారు.  

ఆటోమేటిక్‌ రిలీజ్‌ హుక్స్‌
ఈ హుక్స్‌ వినియోగించిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్‌గా రిలీవ్‌ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 క్రేన్లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేశాం. క్రేన్‌ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా గంటకు 10 విగ్రహాలకు బదులుగా 25 నిమజ్జనం చేయవచ్చు. ఈ హుక్స్‌ పనితీరు పట్ల క్రేన్‌ ఆపరేటర్లు సైతం సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని అన్ని క్రేన్లకు వీటిని వాడటంతో పాటు కొన్నింటిని రిజర్వ్‌లో ఉంచుతున్నాం. – టి.మురళీధర్, శ్రీచక్ర ఇంజినీరింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top