జైపాల్‌రెడ్డి సతీమణికి సోనియా సంతాప లేఖ

Sonia Gandhi Expressed Condolences To Jaipal Reddy Death - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) మృతి పట్ల యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు జైపాల్‌ రెడ్డి సతీమణి లక్ష్మీకి సోనియా గాంధీ సంతాప లేఖ రాశారు. జైపాల్‌రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి, దేశానికి నిస్వార్ధంతో సేవ చేశారని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన నమ్మిన బంటు అని, ఆయన స్థానాన్ని పార్టీలో మరెవరూ భర్తీ చేయలేరని లేఖలో పేర్కొనారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి.. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నెక్లెస్‌ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top