స్మార్‌‌ట సిటీ సాధనే లక్ష్యం | smart city target | Sakshi
Sakshi News home page

స్మార్‌‌ట సిటీ సాధనే లక్ష్యం

Mar 9 2015 2:28 AM | Updated on Sep 2 2017 10:31 PM

కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు.

టవర్‌సర్కిల్ : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో శాస్త్రీయ విజ్ఞానంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టేందుకు ఆదివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
  ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛభారత్‌లో ప్రతీ పౌరుడు పాల్గొనాలని సూచించారు. కేంద్రబడ్జెట్‌లో కూడా స్వచ్ఛభారత్‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌కు శాస్త్రీయ విజ్ఞానం జోడించి టాయిలెట్స్ నిర్మాణం, శుభ్రత చేపట్టాలని పిలుపునిచ్చారు. శుభ్రతంగా ఉంటే 60 శాతం రోగాలు దూరమవుతాయని తెలిపారు. నగరంలో శానిటేషన్‌పై లోతుగా పరిశీలించి ఐటీని ఉపయోగించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు.
 
  చెత్తను ఏలా నియంత్రించవచ్చు, చెత్త తొలగింపు ఎలా జరుగుతుందనే విషయాలపై అధికార యంత్రాంగానిదే బాధ్యత కాదని, ట్రాకింగ్‌సిస్టంతో ప్రజలకు తెలియజేసి అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల ఎంపికకు గట్టి పోటీ ఉందని, స్మార్ట్ హోదా దక్కాలంటే మనం స్వచ్ఛతలో ముందుండాలని సూచించారు. కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడును నగరానికి తీసుకువస్తామని, అప్పటిలోగా కరీంనగర్ స్మార్ట్ అనిపించేలా తీర్చిదిద్దాలని కోరారు. మేయర్, డెప్యూటీ మేయర్‌తోపాటు కార్పొరేటర్లు వారి ఆలోచనలకు పదును పెట్టి క్లీన్‌సిటీగా మార్చాలన్నారు.
 
 ఆధునికీకరణతో ముందుకు : మేయర్
 పారిశుధ్య వాహనాలు, డీజిల్ వాడకం, కార్మికుల పనితీరు అంతా అత్యాధునిక ట్రాకింగ్ సిస్టం ద్వారా ముందుకు వెళతామని మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలోనే ఈ సిస్టం అములు చేస్తున్న మొట్టమొదటి కార్పొరేషన్‌గా కరీంనగర్ పేరు నిలుస్తుందన్నారు. చెత్తను తొలగించాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. ట్రాకింగ్‌సిస్టంతో మరింత మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తామని తెలిపారు.
 
 అనంతరం ట్రాకింగ్ సిస్టంపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆరిఫ్, కార్పొరేటర్ రూప్‌సింగ్, కమిషనర్ రమణాచారి, ఈఈ భద్రయ్య, డీఈ శంకర్, ఆర్వో మక్సూద్‌మీర్జా, శానిటరీ సూపర్‌వైజర్ రాజమనోహర్, అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
 వెహికిల్  ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగం ఇదీ...
 శానిటేషన్ విభాగంలో చెత్తను ఎత్తుకుపోయే ట్రాక్టర్లకు ఎలక్ట్రానిక్‌సెన్సార్లు అమర్చుతారు. వాటిని ఒక కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు.
 
 కార్యాలయంలో ఉండే ఈ కంప్యూటర్‌లో సెన్సార్‌ఉన్న వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉందో గుర్తించవచ్చు. వాహనం తిరుగుతున్నంత సేపు వాటికి సంబంధించిన సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీనివలన వాహనాలు, వాటిపై పనిచేస్తున్న కార్మికులు అనుకున్న విధంగా చెత్తను లిప్టు చేస్తున్నారా లేదా అనేది తెలుసుకునే వీలుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement