‘సిట్’ కు స్థానబలిమికి యత్నం! | 'Sit' attempt to tapping | Sakshi
Sakshi News home page

‘సిట్’ కు స్థానబలిమికి యత్నం!

Jun 22 2015 2:23 AM | Updated on Nov 6 2018 4:42 PM

‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజయవాడ కేంద్రంగా పని చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సూచనల మేరకు సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 12 మంది టెలికం సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని...

భవానీపురం పోలీసుస్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణకు చెందిన ప్రముఖులు, అధికారుల్ని టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న ఈ దర్యాప్తును ఆ భూభాగంలో కంటే స్థానబలిమిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.
 
ట్యాపింగ్ పై ఆధారాల కోసమే పాట్లు!
తెలంగాణలో జరిగిన నేరానికి సంబంధించిన ఆరోపణలపై ఏపీలోని వివిధ పోలీసుస్టేషన్లలో నమోదై, సిట్‌కు బదిలీ అయిన కేసుల్లో పస లేదనే అభిప్రాయాన్ని ఇప్పటికే న్యాయ నిపుణులు ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. అయినప్పటికీ ‘నోటీసులకు నోటీసులు’ అనే ధోరణిలో ముందుకు వెళ్తున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సిట్‌కు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ ఢిల్లీ వరకు వె ళ్లినా ఆశించిన స్పందన రాలేదు.

ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రభుత్వం తొలుత ‘ట్యాపింగ్‌ను నిరూపించడం’ పైనే దృష్టి పెట్టాల్సిందిగా సిట్‌కు స్పష్టం చేశారు.  మొత్తం 147 నంబర్ల ట్యాపింగ్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు అందించాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సిట్ సోమవారం విజయవాడలో విచారించనుంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తును డీజీపీ జాస్తి వెంకట రాముడు ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటికి పూర్తయితే సీఐడీ పోలీసులూ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement