ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం! | sandra appears in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం!

Jul 3 2015 2:54 AM | Updated on Aug 10 2018 8:13 PM

ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం! - Sakshi

ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం!

ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీచేసినప్పటినుంచీ అజ్ఞాతంలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు

ఖమ్మం: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీచేసినప్పటినుంచీ అజ్ఞాతంలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. నగరంలో ఆయన తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న విషయం తెలియగానే స్థానిక టీడీపీ నేతలు, అనుచరులు ఆయనతో భేటీ అయ్యారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తమ పిల్లలను విశాఖపట్నంలోని గీతమ్ స్కూల్లో చేర్పించేందుకు వెళ్లానని, అయితే అప్పటికే అనారోగ్యానికి గురైన తనకు ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు.

తన ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని లిఖిత  పూర్వకంగా ఏసీబీ అధికారులకు రాసిచ్చానన్నారు. 15 రోజుల చికిత్స అనంతరం తన ఆరోగ్యం కుదుటపడిందని, ఇప్పుడు విచారణకు సిద్ధంగానే ఉన్నానన్నారు. ఏసీబీని గౌరవిస్తానని, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.  కాగా, సండ్రను కలిసిన వారిలో టీడీపీ నాయకులు గంగాధర్‌చౌదరి, కర్నాటి కృష్ణ, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మందడపు రామకృష్ణ, బెల్లం వేణు, కొప్పు నరేష్ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement