సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల ఉండదా? అనే ఆందోళనలు రైతుల్లో వ్యక్తమైంది. అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సభా వేదికను హైదరాబాద్కు మార్చినట్లు ప్రభుత్వ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి.
మొదట మధిరలో భారీ బహిరంగ సభ నిర్వహించి, రైతుల సమక్షంలో రైతు భరోసా పథకం నిధులు విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మధిర పరిసరాల్లో కూడా ప్రతికూల వాతావరణం నెలకొనడం.. సభా ప్రాంగణంలో మోకాల లోతు నీరు చేరడంతో.. చివరి నిమిషంలో సభను రద్దు చేసింది.
దీంతో రేపు (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
సభా వేదిక మారినప్పటికీ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిధులు జమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే మధిర సభను రద్దు చేసి హైదరాబాద్లో ఇండోర్ వేదికను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


