సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో సీఎం రాక్షసుడు లాగా అర్ధరాత్రి వెయ్యి ఇళ్ళు కూలగొట్టాడని పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రి కి పైశాచిక ఆనందంగా అనిపిస్తుందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దండుపాళ్యం నాయకులలా ప్రవర్థిస్తున్నారని తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ.."ఖమ్మం లో ఉన్నది ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్ళు, రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోంది. కాంగ్రెస్ మళ్ళీ గెలవదని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి తెలియాలి. కోటి ఎకరాల భూములు 22A కింద పెట్టారు. రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాస రెడ్డి గజదొంగ రెండున్నర సంవత్సరాలలో శ్రీనివాసరెడ్డి చేసింది ఏమీలేదు ఎమ్మెల్యేలు, మంత్రులపై అహంకారం చూపిస్తున్నారు. అధికారం అడ్డంపెట్టుకుని వట్టినాగులపల్లి లో రైతులపై దాడులు చేసారు" అని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిన తరువాత కూడా ప్రజలంతా కేసీఆర్ రావాలని కోరుతున్నారని పాలేరు లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు. ఈ రోజు రైతుబంధు రావడం లేదు, దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారు, యూరియా దుకాణం ముందు రైతులు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు. కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తూ మళ్లీ పెడతా అంటున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీ కార్డులు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.
కేసీఆర్ అప్పుల పాలు చేశాడని మాట్లాడుతున్నారని.. ఆయన లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు. సీతారామా 80 శాతం పూర్తి చేశారు. ఖమ్మం లో రెండు నర్సింగ్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజ్ కట్టించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారని 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు హామీ ఇచ్చారని ఇప్పుడు అర్థమైందన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ లిస్టు వడపోత కార్యక్రమం జరుగుతుందని SIR ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్ట పోతామన్నారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు,35,985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ కు BRS పార్టీ నుంచి కూడా ఒక BLA ను ఏర్పాటు చేసుకోవాలి. అర్హులైన వారివి ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన పార్టీ BLA లదన్నారు. పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదం గా 10 వేల ఓట్లు ఉన్నాయని ,జాగ్రత్తగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.


