‘ఉత్తమ’ సిఫారసులు!

Recommendations in Best Teachers Awards - Sakshi

బెస్ట్‌ టీచర్‌’ అవార్డుల కోసం పలు ఉపాధ్యాయ సంఘాల పైరవీలు

రంగారెడ్డి జిల్లాలో  విద్యాశాఖ గుర్తించిన 51 మంది టీచర్ల జాబితా పెరిగే అవకాశం !

హైదరాబాద్‌ జిల్లాలో రాత్రి పొద్దుపోయాక 60 మందితోఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల

సాక్షి సిటీ బ్యూరో, రంగారెడ్డి జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌ జిల్లాలో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో 51 మందిని ఎంపిక చేశారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ జిల్లా విషయా నికొస్తే....గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఆలస్యమైంది. అంతేకాదు ఉపాధ్యాయుల ఎంపికపై తుది జాబితా వెల్లడికి ముందే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ జిల్లా విద్యాశాఖ ఇవేవీ పట్టించుకోకుండా పనితీరును కాకుండా పైరవీకారులకు, అనర్హులకు జాబితాలో చోటు కల్పించినట్టు తెలిసింది. ఒకే పాఠశాల నుంచి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయడం, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్దపీఠ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. దీనిపై హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ ఆరా తీశారు. అసలు ఎంపిక విధానం ఎలా ఉంది ? ఏఏ నిబంధనలు పరిగణనలోకి తీసుకున్నారు? దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ఎలా ఎంపిక చేశారంటూ వివరాలు అడిగారు. దీంతో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. ఫలితంగా బుధవారం రాత్రి 60 పేర్లతో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లాలో...
 ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌.. జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. పది అంశాల ప్రామాణికంగా  ఉత్తములుగా గుర్తించాలని సూచించింది. విద్యార్థుల నమోదులో అసాధారణ చొరవ, డ్రాప్‌ అవుట్‌లను నివారించడం, అనుభవం, పదో తరగతిలో వందశాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఆయా పోటీల్లో విద్యార్థులకు దక్కిన అవార్డుల్లో వారి పాత్ర, ఆవిష్కరణల అమలు, వందశాతం ఆధార్‌ సీడింగ్, బడుల్లో మౌలిక వసతుల కల్పనకు జరిపిన కృషి, హరితహారంలో ప్రగతి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది. ఉత్తముల ఎంపిక బాధ్యతను ఎంఈఓలకు అప్పగించింది. మండలంలోని స్కూళ్ల సంఖ్యను బట్టి ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను ఎంఈఓలు విద్యాశాఖకు ప్రతిపాదించారు. ఏయే అంశాల ఆధారంగా ప్రతిపాదించారో తెలిపే డాక్యుమెంట్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా 93 మంది పేర్లతో కూడిన జాబితా జిల్లా విద్యాశాఖకు గత నెలలో చేరింది. కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి 51 మంది టీచర్ల పేర్లను ఫైనల్‌ చేసింది. నిర్దేశిత ప్రామాణికాల పరంగా చూపిన చొరవ, కనబర్చిన ప్రతిభను బట్టి టీచర్లకు మార్కులు వేశారు. కేటగిరీ, సబ్జెక్‌ వారీగా ఎక్కువ మార్కులు పొందిన జాబితాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఉత్తములుగా పరిగణించారు. ఈ జాబితాకు గతనెల 28న కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. 

సంఘాల ఆరోపణలు ఇవీ..
అవార్డులు దక్కించుకోవడానికి ఆయా ఉపాధ్యాయ సంఘాల్లో పోటీ నెలకొంది. విద్యా శాఖ రూపొందించిన జాబితా తప్పుల తడకగా ఉందని, అనర్హులకు చోటు కల్పించారని పలు సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికితోడు తమ సంఘానికి చెందిన టీచర్లకు స్థానం కల్పించలేదని, ఫలానా సంఘం వాళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వారి వాదన. వారి లాగే తమ సం ఘం సభ్యులకు అవార్డులు ఇవ్వాలని కొం దరు నేతలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసినట్లు తెలిసింది. పది నుంచి 20 మంది టీచర్ల జాబితాలను చైర్‌పర్సన్‌కు అందజేసి వారికి అవార్డులు దక్కేలా చూడాలని కోరినట్లు సమాచారం. 

ఉత్తముల జాబితా పెంపు?
కలెక్టర్‌ ఆమోదించిన 51 పేర్లు కాకుండా.. ఉత్తముల జాబితాలో మరికొందరి టీచర్ల పేర్లను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసుతో ఇది సాధ్యపడే వీలుంది. గతంలో ఈ తరహా ఘటనలు చాలా జరగడం.. అందుకు బలాన్ని చేకూర్చుతోంది. గతేడాది విద్యాశాఖ 53 మంది టీచర్ల పేర్లను ఖరారు చేయగా.. ఉపాధ్యాయ సంఘాల పైరవీలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తెల్లవారేలోగా ఈ జాబితా 90కు చేరుకోవడం గమనార్హం. అప్పటికప్పుడే జాబితా పెరగడంతో.. కొందరు టీచర్లకు సర్టిఫికెట్లు సరిపోలేదు. శాలువాలతో సన్మానించి సరిపుచ్చాల్సి వచ్చింది. అంతేగా సస్పెన్షన్‌ అయిన టీచర్‌కూ అవార్డు ప్రదానం చేయాలని ఓ సంఘం సభ్యులు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.    

 మేడ్చల్‌  ఉత్తమఉపాధ్యాయులు వీరే...:నేడు కీసర లలితా ఫంక్షన్‌ హాలులో సన్మానం
సాక్షి, మేడ్చల్‌జిల్లా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు గురువారం కీసర మండల కేంద్రంలోని లలితా ఫంక్షన్‌ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  

మండలాల వారీగా వీరే..
శామీర్‌పేట్‌ : గురుచారి, పి.రాజు, వై.మోహన్‌రాజ్, బి.సత్యనారాయణమూర్తి, ఎం.నర్సింగరావు, ఎస్‌.వెంకటరమణ, కె.సంగీత, ఆర్‌.వాణి 8 కుత్బుల్లాపూర్‌: ఏవీ సుబ్బారావు , వి.కరుణ, బి.ఆంజనేయులు  ఘట్‌కేసర్‌: ఏ.శాంతకుమారి, బి.దేవయాని, ఎం.యమున  కూకట్‌పల్లి: పి.నర్సింహులు, ఆర్‌.సంధ్యారాణి, బి.మీనా రాజకుమారి, ఇ.గాలయ్య  ఉప్పల్‌: వై.సంపత్‌కుమార్, ఎన్‌.ప్రమీల, పి.మంజులాదేవి, జె.పాండురంగవిఠల్, డి.విజయశ్రీ, జె.సువర్ణ, కె.అరుణజ్యోతి, ఎం.విజయలక్ష్మి, ఎం.వేణుగోపాల్‌రెడ్డి  అల్వాల్‌: జి.హన్మిరెడ్డి, జి.లక్ష్మయ్య, డాక్టరు రితిభాషిణి, జి.సుప్రియ, వి.భారతి, కాప్రా: బి.బ్రహ్మానందం, బి.గోపాల్, ఎం.శ్రీశైలంరెడ్డి, డి.భగవంత  మేడ్చల్‌: చేపూరి సుజాత, జి.పుష్పలత, టి.రమాదేవి, ఎ.శ్రీనివాసులు, ఎస్‌.వెంకటరమణ; మల్కాజిగిరి: జీవీఆర్‌.రాజేశ్వరి, బి.విలియమ్స్, ఎం.నాగబాబు, వై.పెంచలయ్య  మేడిపల్లి : ఎస్‌.చంద్రశేఖర్‌గౌడ్, శేసం రమాదేవి మూడు చింతలపల్లి: పి.రాధ .

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top