అక్రమ బ్లో అవుట్లు! 

Real ventures on the outskirts of the city - Sakshi

రాజధాని శివార్లలో అడ్డగోలుగా రియల్‌ వెంచర్లు 

అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. విక్రయాలు 

యథేచ్ఛగా 111 జీఓ ఉల్లంఘన 

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్‌లు పుట్టుకొస్తున్నాయి. రియల్‌ రంగం జోరు మీద ఉండటంతో కొందరు రియల్టర్లు, బ్రోకర్లు తక్కువ ధరకు ప్లాట్ల పేరిట ప్రజలను మోసగిస్తున్నారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండానే హైదరాబాద్‌ శివార్లతోపాటు జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి అమ్మేస్తున్నారు. చిన్నపాటి లొసుగులను సాకుగా చూపుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిజి్రస్టేషన్‌ అవుతున్న ప్లాట్లలో దాదాపు 85 శాతం అక్రమ లేఅవుట్లే కావడం గమనార్హం.  

నిబంధనలివి... 
- సాధారణంగా లేఅవుట్‌ ఏర్పాటుకు డీటీసీపీ, హెచ్‌ఎండీఏ తదితర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. పంచాయతీలకు లేఅవుట్‌ జారీ అధికారం లేదు.  
పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ప్లేగ్రౌండ్స్‌ తదితర వాటికి పక్కాగా స్థలాలను కేటాయించాలి.  
తారు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు సౌకర్యాన్ని ప్రతి ప్లాటుకు కల్పించాలి.  
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చుట్టూరా 10 కి.మీ మేర నిర్మాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  
ఈ జలాశయాల పరిరక్షణకు 111 జీఓను తెచ్చి కాలుష్య పరిశ్రమలను నిషేధించింది.  
గృహ, ఇతర అవసరాలకు మాత్రం భూ విస్తీర్ణంలో 10 శాతం మాత్రమే వినియోగించుకునేలా షరతు విధించింది. 

అనుసంధానానికి అడ్డు...
కొత్తగా ఏర్పాటు చేసే లే–అవుట్ల వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖతో అనుసంధానించాలని మున్సిపల్‌ అధికారులు సూచించారు. అనుమతి పొందిన లేఅవుట్లలోని స్థలాలనే రిజిస్ట్రేషన్‌ చేసేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ సబ్‌ రిజి్రస్టార్లకు లేఖ రాసినా రిజిస్ట్రేషన్లశాఖ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. అలాగే 111 జీవో క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిన పంచాయతీరాజ్, హెచ్‌ఎండీఏ విభాగాలు చోద్యం చూస్తుండగా, వాటర్‌బోర్డు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. 

ఈ చిత్రంలో రోడ్డు, ఓ భవన నిర్మాణం ఉన్న ప్రాంతం ఓ కుంట అంటే నమ్ముతారా! కానీ ఇది నిజం.. శంషాబాద్‌ మండలంలోని చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన వెంచర్‌ ఇది. ఇక్కడ జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం ఎలాంటి లే–అవుట్‌లు, నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రియల్టర్లు ఏకంగా కుంటలోనే ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. కుంట సమీపంలో ఉన్న చారిత్రక ఫిరంగి కాలువ కూడా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కి కనుమరుగైంది. ఈ జీఓ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమాలే కనిపిస్తాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top